చంద్రబాబు వద్దకు కనిగిరి లైంగిక వేధింపుల బాధితురాలు.. అండగా ఉంటానని హామీ
కనిగిరి లైంగిక దాడి బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసానిచ్చారు. రూ.10 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్, ఇల్లు మంజూరు చేశారు. విద్యాభ్యాసం ఖర్చు భరిస్తామన్నారు.
అమరావతి: కనిగిరి లైంగిక దాడి బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసానిచ్చారు. బాధిత విద్యార్థినిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు.
దీంతో సీఎం చంద్రబాబు ఆ విద్యార్థినిని పరామర్శించారు. ఆమెకు రూ.10 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్, ఇల్లు మంజూరు చేశారు. అంతేకాకుండా, ఆమె విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
కనిగిరిలో డిగ్రీ చదివే ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. ఆ విద్యార్థినికి కార్తీక్ అనే యువకుడితో స్నేహం ఉంది. దాన్ని అడ్డుపెట్టుకుని ఓ రోజు ఆమెను పంట పొలాల్లోకి తీసుకెళ్లిన కార్తీక్ అక్కడికి తన స్నేహితులను పిలిపించి ఆమెపైకి ఉసిగొల్పాడు.
Recommended Video
సాయి అనే యువకుడు ఆ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడుతుండగా కార్తీక్ అతని స్నేహితులు ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. తననేం చేయొద్దని, వదిలేయమని బాధితురాలు ఆర్తనాదాలు చేస్తున్నా.. ఆమెపై అత్యాచార యత్నాన్ని ఆపలేదు.
ఆమె దుస్తులు లాగి అసభ్యంగా, కిరాతకంగా ప్రవర్తించారు. అనంతరం ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టి వారు పైశాచికానందం పొందారు. కనిగిరిలో ఈ లైంగిక వేధింపుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కనిగిరి వెళ్లి బాధిత విద్యార్థినిని పరామర్శించారు. అన్ని విధాల న్యాయం చేయాలన్న ఉద్దేశంతో బుధవారం ఆ విద్యార్థినిని సీఎం చంద్రబాబు నాయుడి వద్దకు తీసుకొచ్చారామె.