కేంద్రం తీరుపై సిఎం చంద్రబాబు ఆగ్రహం...ఘాటుగా లేఖ:అయినా స్పందించకుంటే?...
అమరావతి:వెనకబడిన జిల్లాలకు కేంద్రం సాయం నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని నిర్ణయించారు.
ఈ మేరకు లేఖ సిద్దం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆయన సిఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు. లేఖ తరువాత కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే వారం రోజుల్లో టిడిపి పార్లమెంటు సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.'
కేంద్రంపై...సిఎం ఆగ్రహం
వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎపిపై ఉద్దేశ్యపూర్వకంగా వివక్ష చూపడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణకు నిధులు విడుదల చేసి...ఏపీకి మొండిచేయి చూపడంపై చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం కాలనే ఇలా చేస్తోందని అభిప్రాయపడ్డారు. అభివృద్ది విషయంలో ఇలాంటి పద్దతేమిటని ఆగ్రహం చెందారు.
కేంద్రానికి...ఘాటు లేఖ
ఈ క్రమంలో ఇదే విషయమై మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో సిఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు వారికి తెలియచెప్పాలని...అందుకోసం కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని సిఎంవో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు.
ఢిల్లీకి...ఎంపీల బృందం
అంతేకాదు ఇదే పద్దు కింద గత ఏడాది కూడా కేంద్రం రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కు తీసుకోవడాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. తాను లేఖ రాసినా కేంద్రం నుంచి స్పందన లేని పక్షంలో తెలుగు దేశం పార్టీ ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపి అక్కడ కేంద్ర మంత్రులు, అధికారుల వద్ద నిరసన వ్యక్తం చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఆందోళన...ఉధృతం
అప్పటికీ స్పందించకుంటే కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన ఉద్ధృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం వివక్షను గురించి ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సిఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కేంద్రం వివక్షపై బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు నోరు తెరవకపోవడంపైనా ఆయా పార్టీలను టిడిపి శ్రేణులు గట్టిగా ప్రశ్నించాలని...నిలదీయాలని చంద్రబాబు నిర్ణయించారు.
Recommended Video