కిడారి పెద్ద కుమారుడికే అరకు ఎమ్మెల్యే సీటు?...అదే సిఎం అభిమతం:అలా తెలిసిందంటున్నారు!
విశాఖపట్టణం:మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించి సాయం ప్రకటించారు.
కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. కోటి సాయం అందిస్తామని కుటుంబసభ్యుల్లో నలుగురికి రూ.5లక్షల చొప్పున పార్టీ తరపున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే చిన్న కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తామని...ఇక మొదటి కుమారుడికి ఏం చేయాలన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దీన్ని బట్టి కిడారి పెద్ద కుమారుడికి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఖాయమని, అదే సిఎం అభిమతమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. అమరావతి నుంచి విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి హెలికాప్టర్లో పాడేరు చేరుకున్నారు. ముందుగా కిడారి నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గిరిజనులకు ఎనలేని సేవలందించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడం బాధాకరం. ఆయన చనిపోయారన్న విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. కిడారి ఆశయాల సాధనకు టిడిపి కృషి చేస్తుందని...గిరిజనుల్లో ఇంతటి బలమైన రాజకీయ నేత ఉండటం చాలా అరుదన్నారు.
సాయం గురించి చంద్రబాబు మాట్లాడుతూ..."కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.కోటి సాయం అందిస్తాం. కుటుంబసభ్యుల్లో నలుగురికి రూ.5లక్షల చొప్పున పార్టీ తరపున ఇస్తాం. చిన్న కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తాం. మొదటి కుమారుడికి ఏం చేయాలన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆయనకు పార్టీ టిక్కెట్ ఇవ్వాలా? వద్దా? అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి విశాఖ నగరంలో వారికి స్థలం కేటాయిస్తాం. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాం"...అని చెప్పారు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరూ చెప్పకుండానే తనంతట తానుగా చిన్న కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించడంతో పెద్ద కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేది ఆయన మనోగతమై ఉండొచ్చని కొందరు టిడిపి నేతలే విశ్లేషిస్తున్నారు. మావోయిస్టుల ముప్పు దృష్ట్యా ఆ కుటుంబం వద్దనుకుంటే తప్ప అరకు ఎమ్మెల్యే టికెట్ వారికే ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. కిడారి కుటుంబానికి సాయం సందర్భంగా సిఎం చంద్రబాబు ప్రకటనను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ విషయం అర్థమైపోతుందని అంటున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి నేపథ్యంలో అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎపి శాసనసభ సెక్రటరీ విజయరాజు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతిచెందడంతో అరకు అసెంబ్లీ స్థానం ఖాళీగా అయిందని, ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని చెప్పారు. దాంతో అసెంబ్లీ స్ధాన ఖాళీ అయ్యిందంటూ అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘానికి అధికారపూర్వకంగా తెలియజేశారు. ఎన్నికల కమీషన్ అధికారులు అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ కు పంపారని తెలిసింది.
ఇదిలావుండగా మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు ముందుగా సివేరి సోమ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించారు. ఏడుగురు కుటుంబ సభ్యులకు రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామన్నారు. అలాగే పార్టీ తరపున ఒక్కొక్కరికి రూ.5 లక్షలు సహాయం అందజేస్తామని తెలిపారు. సోమ రెండో కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. విశాఖలో ఇంటి స్థలంతో పాటు అరకులో నిర్మాణంలో ఉన్న ఇంటికి పట్టా ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.