మోడీకి కృతజ్ఞతలు: సాగరమాల ప్రాజెక్టుతో వృద్ధిరేటు మెరుగన్న చంద్రబాబు
న్యూఢిల్లీ: వృద్ధిరేటు పెరుగుదలకు సాగరమాల ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన సాగరమాల ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు సాగరమాల ప్రాజెక్టు ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. సరుకు రవాణాపై వ్యయాన్ని తగ్గించేందుకు ఇదొక మార్గామని అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలోనే ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
మౌలిక సదుపాయాల కల్పనను అభివృద్ధి పరచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన అజెండా అని అన్నారు. ఈ ప్రాజెక్టును మళ్లీ చేపట్టినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు బాబు తెలిపారు. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై ఈ సమావేశంతో తొలి అడుగుపడింది.
జాతీయ సాగరమాల లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలు, సాగరమాలా అమలు తీరుతెన్నులు, ఏర్పాటు చేయాల్సిన యంత్రాంగం, పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తదితర అంశాలను చర్చించారు. జల రవాణా అభివృద్ధి, ఓడరేవుల పరసరాల అభివృద్ధి, అందుకు తగిన మౌలిక సదుపాయాల ఏర్పాటే ఈ సాగరమాల పథకం లక్ష్యం.
లక్ష్య సాధనకు వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థల మధ్య సమన్వయ సాధనపై సమావేశంలో చర్చించారు. కొత్త ఓడరేవుల నిర్మాణం, ఓడరేవుల ఆధునికీకరణ తదితర అంశాలపై చర్చించి తగిన నిర్ణయం త్వరలో తీసుకుంటారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పానిగరియా, ఆంధ్ర ప్రదేశ్, గోవా, కర్నాటక, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పాండిచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
వీరితో పాటు కేంద్ర ఆర్థిక జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ, పట్టణాభివృద్ధి, రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సివిల్ ఏవియేషన్, సామర్థ్య అభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్, పర్యావరణం, అటవీ, వాతావరణ పరిస్థితులు, వాణిజ్యం, పరిశ్రమలు, పర్యటన శాఖ మంత్రులతోపాటు ఎపెక్స్ కమిటీ కార్యదర్శి, షిప్పింగ్ శాఖ కార్యదర్శి సమావేశంలో పాల్గొన్నారు.
చంద్రబాబుతో అంతర్గత నదీ జలాల చైర్మన్ అమితాబ్ వర్మ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అంతర్గత నదీ జలాల చైర్మన్ అమితాబ్ వర్మ సోమవారం భేటీ అయ్యారు. ఏపీలో జలరవాణా మార్గాల అభివృద్ధి అవకాశాలపై చంద్రబాబుకు అమితాబ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.