కలచివేసింది, తీరనిలోటు: గాలి మృతిపై బాబు దిగ్భ్రాంతి, షాకయ్యానని హరికృష్ణ
Recommended Video
అమరావతి: తెలుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆకస్మిక మరణంపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ స్థానంలో ముద్దుకృష్ణమ పాత్ర కీలకమైందని అన్నారు.
గాలి ముద్దుకృష్ణమ నాయుడు(71) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకునిగా పలు పదవులు చేపట్టిన ఆయన రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
కలచివేసింది
గాలి ముద్దుకృష్ణమ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని చంద్రబాబు అన్నారు. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
మంత్రులు, నేతల సంతాపం
గాలి ముద్దుకృష్ణమ మృతి పట్ల కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకట్రావు, నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, దేవినే ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, సినీనటుడు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.
ఎంతో బాధ
గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతిపై నందమూరి హరికృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలి మృతి పట్ల సంతాపం ప్రకటించిన హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణ వార్త విన్న వెంటనే షాక్కు గురయ్యనని నందమూరి హరికృష్ణ తెలిపారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తననెంతో బాధించిందన్నారు.
మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత
సన్నిహితుడిని కోల్పోయాం
1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన ముద్దుకృష్ణమ.. అప్పటి నుంచి ఆయన ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచే వరకు ఆయన వెంటే ఉన్నారని హరికృష్ణ అన్నారు. తమ కుటుంబంతో ముద్దుకృష్ణమ ఎంతో సన్నిహితంగా ఉండేవారని హరికృష్ణ చెప్పారు.
తీరని లోటు
టీడీపీలో గాలి ముద్దుకృష్ణమ ఎంతో క్రమశిక్షణ గల నేతగా ఎదిగారని చెప్పారు. ఎన్నో పదవులు చేపట్టిన ముద్దుకృష్ణమ వాటికి వన్నె తెచ్చారని అన్నారు. ఆయన మృతి ప్రజలకు తీరని లోటని హరికృష్ణ పేర్కొన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముద్దుకృష్ణమనాయుడు ఎంతో మంది యువ నాయకులకు ఆదర్శప్రాయుడని హరికృష్ణ కొనియాడారు.