చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు: గిరిజనులకు తెలివి ఉండదని..
'ఎస్టీలు అడవుల్లోనే ఉంటారు.. ఎక్కెడక్కడో తిరుగుతుంటారు.. వారికి తెలివి ఉండదు, వారిని కూడా అభివృద్ధి చేస్తాం' అని అన్నారు.
చిత్తూరు: గిరిజనులను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గిరిజనులకు తెలివి ఉండదంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల దుమారం రేగే సూచనలు కనిపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని గుడుపల్లెలో గురువారం పర్యటించిన సీఎం.. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు.'ఎస్టీలు అడవుల్లోనే ఉంటారు.. ఎక్కెడక్కడో తిరుగుతుంటారు.. వారికి తెలివి ఉండదు, వారిని కూడా అభివృద్ధి చేస్తాం. పేదరికాన్ని పారదోలేందుకు యజ్ఞంలా పనిచేస్తున్నా!' అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పేదరికంలో ఉన్నవారిని అభివృద్ధిలోకి తీసుకురావడం మంచి విషయమే అయినా.. గిరిజనులకు తెలివి ఉండదంటూ చిన్నచూపు చూడటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కార్యక్రమంలో సీఎం మరిన్ని విషయాలు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం రూ.10వేల కోట్లు కేటాయించి ఆదుకుంటామన్నారు.
ఇక అభివృద్ది పనుల విషయాల్లో పొరపాట్లకు కార్యకర్తలదే పూర్తి బాధ్యతన్నారు సీఎం. దానికి తనపై కోపం చూపవద్దన్నారు. వాళ్లు చేసే తప్పిదాలకు తనపై ఆగ్రహం ప్రదర్శిస్తే.. రాష్ట్రంలో అభివృద్ది ఆగిపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో 90శాతం ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఇక నదుల సంధానం గురించి ప్రస్తావిస్తూ.. గోదావరి, కృష్ణా నదులను కలిపి హంద్రీనీవా ద్వారా సెప్టెంబర్ లోగా కుప్పం నియోజకర్గంలోని ప్రతీ చెరువుకూ నీరందిస్తామన్నారు. దేశ చరిత్రలో నదులను అనుసంధానం చేసిన ఘనత నాదే అన్నారు.