19 ఏళ్లుగా మంచంపైనే, చలించిపోయిన చంద్రబాబు.. ఆదుకుంటానంటూ అభయం!
విజయవాడ: అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ వెన్నెముక, కాళ్లూ చేతులు చచ్చుబడిపోయి ఎముకల గూడులా మారి మంచానికే పరిమితమైన ఖమ్మం జిల్లాకు చెందిన దాసరి శ్రీనివాస్, సుహాసిని దంపతుల కుమారుడు వర్ధన్ ఆరోగ్య స్థితిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలించిపోయారు. సాయం చేస్తానని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.
పంతొమ్మిదేళ్ల వర్ధన్ పరిస్థితి, అతడి కుటుంబం పడుతున్న ఇబ్బందులను ఇటీవల ఓ ఛానల్ 'అమ్మ ప్రేమ' అనే కథనం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనం చూసి దేశ విదేశాల్లోని ఎంతో మంది చలించిపోయారు. తమ వంతు సహాయం చేస్తామంటూ ముందుకొచ్చారు.
దాసరి శ్రీనివాస్, సుహాసిని దంపతులది నిరుపేద కుటుంబం. వర్థన్ వారి రెండో సంతానం. పంతొమ్మిదేళ్ల క్రితం వర్ధన్.. పుట్టిన వారానికే అతడి కళ్లు పచ్చబడ్డాయి. వైద్యులకు చూపించినా ఫలితం లేదు. ఆ తరువాత అతడి కాళ్లూ చేతులు కూడా చచ్చుబడిపోయాయి. దీంతో వర్ధన్ ఇన్నేళ్లూ మంచానికే పరిమితమయ్యాడు. చికిత్స కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగారు.. కానీ ఫలితం మాత్రం కానరాలేదు.
ఉన్న ఆస్తంతా వర్ధన్ చికిత్స కోసమే కరిగిపోయింది. చివరికి సొంత ఇల్లు కూడా అమ్మేసుకుని విజయవాడకు వలస వచ్చారు వర్ధన్ తల్లిదండ్రులు. తల్లిదండ్రుల మాటలు అర్థమైనా వర్ధన్ స్పందించలేడు. చివరికి ఆకలి వేసినా కన్నతల్లికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. దీంతో అతడి తల్లి సుహాసిని కొడుకు ఆలనాపాలనా చూసుకుంటూ అతడ్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
వర్ధన్ ఆరోగ్య పరిస్థితి, అతడి కుటుంబ దుస్థితిపై ఇటీవల ఓ చానల్ ప్రసారం చేసిన కథనం పలువురిని కదిలించింది. ఈ నేపథ్యంలో అతడి కుటుంబానికి సాయం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, పలువురు కార్పొరేటర్లు ముందుకొచ్చారు. సోమవారం వారు వర్ధన్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిశారు. తమకు ఒక పక్కా ఇల్లు మంజూరు చేయించాలని ఈ సందర్భంగా వర్ధన్ తల్లిదండ్రులు వారిని కోరగా అందుకు సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఇల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమ మంగళవారం వర్ధన్ కుటుంబ సభ్యులను తన కారులోనే సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వర్ధన్ పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చలించిపోయారు. వారికి అండగా ఉంటామని హామీ ఇవ్వడమేకాక వెంటనే వారికి పక్కా ఇల్లు కూడా మంజూరు చేశారు.
దీంతో వర్ధన్ తల్లిదండ్రులు శ్రీనివాస్, సుహాసిని సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు విదేశాల నుంచి కూడా పలువురు వర్ధన్కు సాయం చేసేందుకు ముందుకొస్తున్నట్లు సమాచారం.