కాపు రిజర్వేషన్లపై జగన్ది రోజుకో మాట... మళ్లీ తిరుగులేని మెజారిటీ ఇవ్వండి: సిఎం చంద్రబాబు
విశాఖపట్టణం:కాపుల రిజర్వేషన్ల విషయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. దివాలాకోరు రాజకీయాలతో బీజేపీకి ఊడిగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
సిఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. ఎస్.రాయవరం మండలం గుడివాడ గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు. "రిజర్వేషన్ల కోటా కేంద్రం పరిధిలో ఉందని, తమకు సంబంధం లేదని జగన్ అంటున్నారు...మరి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రం పరిధిలోనే ఉన్నాయి. అవి కేంద్రం పరిధిలో ఉన్నాయని వాటి గురించి మాట్లాడరా?"...అని చంద్రబాబు ప్రశ్నించారు.
వైసిపి...రెచ్చగొట్టే ధోరణి
విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గుడివాడ గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సిఎం చంద్రబాబు ప్రసంగిస్తూ..."వైసీపీ వాళ్లు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు...రోజుకోమాట, పూటకోమాట మాట్లాడుతున్నారు...తమిళనాడు తరహాలో కాపులకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని నిన్నమొన్నటి వరకు డిమాండ్ చేసిన జగన్ ఇప్పుడు మాట మార్చారు"...అని చెప్పారు. ఇది కేంద్రం పరిధిలో ఉంది.. సాధ్యం కాదంటున్నారు. తమకు సంబంధం లేదంటున్నారు. అలాగనుకుంటే ప్రత్యేక హోదాతో సహా పలు అంశాలు కేంద్రం పరిధిలోనే ఉన్నాయి. అవి కేంద్రం పరిధిలో ఉన్నాయని వాటి గురించి ఆయన మాట్లాడరా' అని నిలదీశారు.
పద్దతి ప్రకారమే...చేశాం
ప్రతిదానికీ పద్ధతి ఉంటుందని...బీసీలకు ఏ మాత్రం నష్టం కలుగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపామని సిఎం చంద్రబాబు గుర్తుచేశారు. రిజర్వేషన్లు 50 శాతం దాటితే కేంద్రం ఆమోదించే అవకాశం లేదు కాబట్టి...కాపులకు ఐదు శాతం కోటా పెట్టి పంపించామన్నారు. కాపులకు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో ఏటా రూ.1000 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని స్పష్టం చేశారు. అలాగే ఎస్టీలకు నష్టం కలగకుండా మత్స్యకారులకు రిజర్వేషన్లు కల్పించేందుకు యత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
జగన్...బోనెక్కాలి
"అవినీతి కేసులను మాఫీ చేయించుకునేందుకే జగన్ రాజకీయాలు చేస్తున్నారని...రాష్ట్ర భవిష్యత్ను తాకట్టుపెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘ప్రతి శుక్రవారం కోర్టు బోనెక్కాలి. గురువారం రాగానే హైదరాబాద్ వెళ్తున్నారు. మళ్లీ వచ్చి రోజుకు ఒకటి రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. ఫొటోలు అవీ ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. సినిమా షూటింగ్ మాదిరిగా చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నీతి లేదు.. నిజాయితీ లేదు.. చిత్తశుద్ధి లేదు.. రాజకీయ లబ్ధి కోసం, కేసుల మాఫీ కోసం భావితరం భవిష్యత్ను కూడా తాకట్టుపెడుతున్నారు"...అని ధ్వజమెత్తారు.
చెరోపక్క పెట్టుకొని...బిజెపి మోసం
ఓ పక్క జగన్ను, మరో పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను పక్కన పెట్టుకుని బీజేపీ రాష్ట్రాన్ని మళ్లీ మోసం చేయాలని ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఎవరు ఎన్ని విధాలుగా యత్నాలు చేసినా తెలుగు ప్రజల్ని మోసం చేయలేరు...ఖబడ్దార్ అని చంద్రబాబు హెచ్చరించారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక్కరైనా ఓటువేస్తారా? ఆ పార్టీ చేసిన మోసానికి, నమ్మక ద్రోహానికి ఎంతో ఆవేశం వస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు మాట మార్చింది. ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నది మోదీ ప్రభుత్వమా కాదా?..భావితరాల భవిష్యత్ కోసమే కేంద్రంతో టీడీపీ పోరాటం సాగిస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రైల్వేజోన్ కోసం టీడీపీ ఎంపీలు ఢిల్లీలో వీరోచితంగా పోరాడుతుంటే..వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి వెన్నుచూపారు"
అంతా...కలసి పనిచేయాలి
"అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో, సమన్వయంతో ప్రజలకు సేవచేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజల సంతృప్తిస్థాయి 95 శాతానికి పెంచాలనేది లక్ష్యం. వారంలో రెండు రోజులు ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో పర్యటించి గ్రామదర్శిని, వికాసం కార్యక్రమంలో పాల్గొంటారు. బీసీ వర్గాలకు చెందిన 130 కులాలు ఉన్నాయి. వారంతా వృత్తి పరికరాలను పొంది ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. రాష్ట్రంలో ప్రతినెలా 52 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. 50 ఏళ్లు దాటిన మత్స్యకారులందరికీ నెలకు రూ.1000 పింఛను ఇస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. మొదలుపెట్టిన కార్యక్రమాలు, పథకాలను కొనసాగించేందుకు మళ్లీ టిడిపికి తిరుగులేని మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నాం"...అని సిఎం చంద్రబాబు చెప్పారు.