చంద్రబాబు నేతృత్వంలో...టిడిపి వ్యూహ కమిటీ భేటీ:ఉత్కంఠ
అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ మరోసారి భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాలవ శ్రీనివాసులు, లోకేశ్, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో రాజకీయ పరిణామాలతో పాటు ఎపిలో పరిస్థితులు, ఎంపీల ఆందోళన నేపథ్యంలో కేంద్రం స్పందించకుంటే అనుసరించాల్సిన వ్యూహం పై కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే ఈ నెల 11 ఆదివారం తెదేపా పోలిట్బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలపై కీలక చర్చలతో పాటు పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు తెలిసింది.
ఇదిలావుండగా టిడిపి రాజ్యసభ స్థానాలు ఈసారి ఎవరికి దక్కుతాయోననే విషయమై ఆ పార్టీతో పాటు అందరిలోను ఉత్కంఠ నెలకొంది. శని, ఆదివారాలు సెలవులు కావడం, నామినేషన్ దాఖలుకు సోమవారామే చివరి రోజు కావడంతో ఎవరికి అవకాశం లభిస్తుందోనని ఆశావహులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరిగే పొలిట్బ్యూరో సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది.