ప్రత్యేక హోదాపై సిఎం చేయబోతోంది దీక్షా?...వేడుకా?...ప్రశ్నిస్తున్న నెటిజన్లు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈనెల 20న సిఎం చంద్రబాబు 'ధర్మపోరాట దీక్ష' పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిరశన దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 20 ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం కాగా ఆ రోజు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని, ఆ రోజంతా నిరాహార దీక్ష కొనసాగించి నిరసన తెలియచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఈ దీక్ష నిర్వహణ కోసం చేస్తున్న హడావుడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు సంధిస్తున్నారు. నెటిజన్ల వాదన ఏమిటంటే?...
జరిగేది...దీక్షేనా? లేక ఏదైనా వేడుకా?
ఈ నెల 20 న జరిగేది...ముఖ్యమంత్రి చంద్రబాబు చేయాలనుకుంటున్నది ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా దీక్షేనా లేక ఆ పేరుతో ఏదైనా భారీ వేడుకా?...దీక్షే అయితే ఈ హడావుడి ఏంటి?...నిరసన దీక్ష కోసం మంత్రులతో ఉప సంఘం నియమించడమేంటి?...ఇక్కడ కూడా ఈవెంట్ మేనేజ్ మెంటా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఆరోజు...సిఎం చేయాలనుకుంటున్నది
ఏప్రిల్ 20 వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రం కోసం నిరశన దీక్ష చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఎపికి ప్రత్యేక హౌదా, విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల తరఫున ఈ దీక్ష చేయనున్నట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైయ్యే దీక్ష సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని టిడిపి శ్రేణులు తెలిపాయి.
అయితే...అక్కడజరిగేది ఏంటి?
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తామే నిజమైన పోరాటం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. తాను చేయబోయే ఒక్కరోజు నిరాహారదీక్ష కూడా ప్రత్యేక హోదా పోరాటంలో భారీ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సిఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవంగా ఆ రోజు సిఎం చంద్రబాబు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు సమాచారం. దీక్ష ముగిశాక అదే రోజు సాయంత్రం మున్సిపల్ స్టేడియంలోనే టిడిపి-దళితతేజం విజయోత్సవ సభను కూడా నిర్వహిస్తారు. అదే రోజు నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల కేంద్రాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు నిర్వహిస్తారు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలాంటి దీక్షకు...అలాంటి హడావుడా?...నెటిజన్ల ప్రశ్న
అయితే ప్రత్యేక హోదా విషయమై చేసే దీక్ష కోసం ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని కేబినెట్లో చర్చించి మరీ నిర్ణయం తీసుకోవడం అనేది జరగబోయేది ఒక పోరాట దీక్ష అనే భావాన్ని కాకుండా ఏదో వేడుకనో...భారీ ఈవెంట్ నో నిర్వహించబోతున్న సంకేతాలు ఇస్తోందని, పైగా ఆ ఉపసంఘంలో ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ కు కూడా స్థానం కల్పించడం నైతికంగా కరెక్ట్ కాదని నెటిజన్లు విమర్శలు సంధిస్తున్నారు. ఈ కమిటీ లో లోకేష్ కు స్థానం కల్పించడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షలో సీరియస్ నెస్ ను తగ్గించడమే కాకుండా లేనిపోని అనుమానాలకు మీరే తావిచ్చినట్లు అవుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
మోడీని విమర్శించి...మళ్లీ అదే పనా?
ప్రధాని మోడీ దీక్ష చేయడం విడ్డూరమని, ఆ దీక్ష ప్రజల దృష్టి మరల్చడానికేనని తీవ్రంగా విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ తానే దీక్ష చేయాలనుకోవడాన్ని ఇదే సందర్భంలో నెటిజన్లు తప్పుబడుతున్నారు. అంతేకాదు ప్రతిపక్షాలు ఏ ఆందోళన చేసినా దమ్ముంటే ఢిల్లీలో చేయాలని, ఇక్కడ చేస్తే అని చంద్రబాబు విమర్శించేవారని మరి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం విజయవాడలో పోరాటం చేయాలనుకోవటం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టిడిపి ఎంపీ ప్రధాని ఇంటి ముందు పోరాటం చేయడం ద్వారా ఎంతో గుర్తింపు వచ్చింది అని ప్రశంసించిన చంద్రబాబు తాను కూడా ఢిల్లీలో దీక్ష చేస్తే నిజంగానే అందరికంటే ఈ పోరాటంలో మందుండేవారని నెటిజన్లు సలహా ఇస్తున్నారు. అలా చేసి ఉంటే జాతీయ మీడియాలో కూడా మంచి మైలేజీ వచ్చి ఉండేదని అంటున్నారు. అయితే ఏదేమైనప్పటికి ప్రత్యేక హోదా పోరాటంలో సిఎం చంద్రబాబు నభూతో నభవిష్యత్ అన్న చందంగా చేయనున్న దీక్షకు నిజంగానే దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయమని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.