ప్రజలను పిచ్చోళ్లనుకుంటున్న చంద్రబాబు...పునాది గోడలు చూపించి పోలవరం పూర్తయినట్లు బిల్డప్:వైఎస్ జగన్
Recommended Video
విశాఖపట్టణం:పునాది గోడలు కూడా దాటని పోలవరం ప్రాజెక్టును చూపించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలందరినీ పిచ్చివాళ్లను చేస్తున్నాడని ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
విశాఖపట్టణం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం జంక్షన్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సిఎం చంద్రబాబు ప్రజలకు రోజుకో సినిమా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారని, నగరాన్ని దోచేస్తున్నారని జగన్ విమర్శల వర్షం కురిపించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ లా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
విశాఖలో...దోచుకుతిన్నారు
విశాఖ జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం జంక్షన్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో వైసిపి అధినేత జగన్ మాట్లాడుతూ..."హుద్హుద్ వచ్చినప్పుడు సముద్ర అలలు మనవైపు రాలేదు...వర్షం, విపరీతమైన గాలులు వచ్చాయి...కానీ చంద్రబాబు హుద్హుద్నూ వదిలిపెట్టలేదు...ఈ తుపాన్ను కారణం చూపించి తహసీల్దారు ఆఫీసుల్లో 16 వేలకు పైగా ఎఫ్ఎంబీలు మాయమైపోయాయి...379 రీసర్వే సెటిల్మెంటు రిజిస్టర్లు (ఆర్ఎస్ఆర్లు), 233 మ్యాపులు మాయమైపోయాయి...ఇలా కట్టు కథలు చెప్పి మమ్మల్ని దోచుకుతిన్నారని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు"...అన్నారు.
పోలవరం...పిచ్చోళ్లను చేస్తున్న సిఎం
జగన్ తన ప్రసంగం కొనసాగిస్తూ..."చంద్రబాబు తన మూడేళ్ల మనవడిని కూడా తీసుకుని పోలవరం వెళ్లాడు...అక్కడ ప్రాజెక్టు పనులు చూస్తే పునాది గోడలు కూడా దాటవు...ఇంకా ఈ ప్రాజెక్టు మట్టికట్ట డిజైన్ కూడా ఖరారు కాలేదు...కానీ ఈ పెద్ద మనిషి గ్యాలరీ వాక్ అంటూ ప్రాజెక్టు పూర్తయిందన్నట్లు చూపిస్తున్నాడు...అసలు గ్యాలరీ, గ్యాలరీ అంటూ చంద్రబాబు చెప్పే కొత్త పదానికి అర్థం ఏమిటో తెలుసా?...గ్యాలరీ అంటే పునాదుల్లో ఒక భాగమే. కానీ ఈయన ఎలాంటి బిల్డప్ ఇస్తాడంటే.. పునాదులు వేసి ఇల్లు పూర్తయిపోయినట్టుగా గృహ ప్రవేశానికి పిలుస్తాడు. కేవలం పునాదులు మాత్రం వేసి ఇల్లు నిర్మించకుండానే గృహ ప్రవేశానికి ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే ఆ వ్యక్తిని మీరు ఏమంటారు...పిచ్చోడనరా? లేదా మోసం చేశాడనరా?...ఇవాళ మన ఖర్మ ఏమిటంటే మనందరినీ పిచ్చోళ్లను చేస్తున్నాడీ పెద్దమనిషి చంద్రబాబు"...అని ధ్వజమెత్తారు.
ఈ పెద్దమనిషి...మెలోడ్రామా
"ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా కూడా తోడై తానా అంటే తందానా...అంటూ ఆయన ఏది చెబితే అది ప్రచారం చేస్తోంది. ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట యుద్ధం చేస్తున్నాడంటారు...మనకు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఎవరు?...నాలుగున్నరేళ్ల క్రితమే...ఆరు నెలలకో ఏడాదికో ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీసి ఉంటే, హోదా ఇవ్వకపోతే మంత్రి వర్గం నుంచి వైదొలుగుతామని అల్టిమేటం ఇచ్చి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది కదా?... కానీ ఈ పెద్దమనిషి అలా చేయలేదు. ఈ పెద్దమనిషిలో అన్నీ డ్రామాలు కనిపిస్తున్నాయి"...అని విమర్శల వర్షం కురిపించారు.
265 వ రోజు...ఆనందపురంలోనే
ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 265 వ రోజు మంగళవారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండల పరిధిలోని గ్రామాల మీదుగా సాగనున్నట్లు వైసిపి శ్రేణులు తెలిపాయి. ఆనందపురం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర నేల్తేరు క్రాస్, పాలవలస క్రాస్, సీతమ్మపాలెం క్రాస్, పందలపాక బీసీ కాలనీ, పందలపాక క్రాస్, తర్లువాడ, బాకూరుపాలెం క్రాస్ మీదుగా ముచ్చెర్ల క్రాస్ వరకు సాగనుంది.