కుట్రలు చేస్తే అణిచేస్తా: జగన్ పార్టీకి బాబు తీవ్ర హెచ్చరిక
అమరావతి: రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, అలాంటి వాటిని గట్టిగా అణచివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర హెచ్చరిక చేశారు. కుట్రలు చేసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజధాని నగరాభివృద్ధి ప్రణాళికల అమలు, సింగపూర్ కన్సార్టియం ఆఫ్ కంపెనీలతో త్వరలో చేసుకోనున్న కన్సార్టియం అగ్రిమెంట్, తదితర అంశాలపై రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్డిఎ) అధికారులతో ముఖ్యమంత్రి ఆదివారం టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు.
విశ్రమించను..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాజధాని నగరం అమరావతి రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమయ్యేలా కడతా. భగవంతుడు నాకు ఇచ్చిన ఆ బాధ్యతను నెరవేర్చి జన్మను చరితార్థం చేసుకుంటా. అప్పటిదాకా ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా వాటిని అధిగమించుకుంటూ ముందుకెళతా. రాజధాని ప్రాంత రైతులు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఎన్నటికీ వమ్ము చేయను. ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతిని నిర్మించేదాకా విశ్రమించను' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
జగన్ పార్టీకి హెచ్చరిక
‘కోపం ఉంటే నాపైనే నేరుగా తీర్చుకోండి. రాష్ట్రంపైనా, అమాయకులైన రాజధాని ప్రాంత రైతులపైనా కొందరికి ఎందుకంత కక్ష? వారి పేరిట ప్రపంచ బ్యాంకుకూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకూ తప్పుడు లేఖలెందుకు రాయడం? రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నాలు ఎందుకు చేయడం? నన్ను నమ్మి దాదాపు 40వేల కోట్ల రూపాయల విలువైన 33,500 ఎకరాల భూమిని ఇవ్వడమే రైతులు చేసిన పాపమా? ఇలాంటి చర్యలకు పాల్పడి అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేయడం న్యాయమా? ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకునేది లేదు. ఇలాంటి వాటిని గట్టిగా అణచివేస్తాం' అని పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు హెచ్చరిక చేశారుచంద్రబాబు.
న్యాయపరమైన చర్యలూ తప్పవు..
అంతేగాక, ‘ఇలాగే కొనసాగితే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని, ఇదే సమయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని బాబు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ హక్కు, అధికారం ఉండేలా రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు అన్నారు.
కుట్రలు, దొంగ లేఖలు...
ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు ఆర్థిక సహకారం అందించవద్దంటూ ప్రపంచ బ్యాంకుకు రైతుల పేరిట దొంగ లేఖలు రాశారంటూ జగన్ పార్టీపై మరోసారి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేందుకు వీల్లేదని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల నుంచి ప్రభుత్వ దృష్టిని మరల్చేందుకే ఇలాంటి కుట్రలన్నీ చేస్తున్నారన్నారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని సాధించి తీరుతామన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు 1,27,505మంది కాగా, తాము నిర్వహించిన సర్వేలో కేవలం 150 మందే పాల్గొన్నారని ప్రపంచ బ్యాంకు వెబ్సైట్ స్పష్టంగా పేర్కొందని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ నిబద్ధతపై రాజధాని ప్రాంత రైతుల్లో ఉన్న విశ్వాసానికి ఇంతకంటే ప్రతీక ఇంకేమి కావాలని ప్రశ్నించారు. వాస్తవానికి రాజధాని నగర నిర్మాణంపై అడ్డుపడే కుట్రలు ఈనాటివి కావని, 2016 అక్టోబర్ 8 నుంచే మొదలయ్యాయన్నారు.
సవాళ్లు కొత్తేం కాదు..
‘సవాళ్లు నాకు కొత్తకాదు. భారత్లో తొలిసారిగా 1997-98లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాను. అందులో భాగంగా ఆనాడు దాదాపు రూ.4,500 కోట్ల రుణం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొస్తే అప్పుడు అడ్డంకులు సృష్టించారు. మరేమైంది? వారి ఆశ అడియాస అయింది. మేం చేపట్టిన విద్యుత్ సంస్కరణలు విజయవంతం అయ్యాయి. ఇప్పుడు విద్యుత్ స్వయం సమృద్ధి సాధించి ప్రజలకు కరెంట్ సరఫరా చేయటానికి నేను ప్రవేశపెట్టిన ఈ సంస్కరణలే కారణమయ్యాయి' అన చంద్రబాబు తెలిపారు.
ప్రజలు గుర్తిస్తున్నారు..
రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసేలా చేస్తున్న కుట్రలను ప్రజలు గుర్తిస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలకు జీవనరేఖ లాంటి పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఈ వ్యక్తులు చేయని ప్రయత్నాలు లేవని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి, అటవీ, పర్యావరణ శాఖకు, గ్రీన్ ట్రిబ్యునల్కూ, సుప్రీంకోర్టుకూ వెళ్లారని, అమరావతి విషయంలోనూ ఇదే విధానాన్ని అవలంబించారన్నారు. మరోవైపు రాజధానిలో కార్యకలాపాలను చేపట్టేందుకు ముందుకొచ్చిన ప్రముఖ విద్యాసంస్థలు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తున్నాయని ఆయన వివరించారు. విట్, ఎస్ఆర్ఎం వంటి సంస్థలు ఈ ఏడాది నుంచే తమ కార్యకలాపాలను చేపట్టాయని, మిగిలిన సంస్థలూ ఇదే తరహాలో సంస్థలను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
వేగం పెంచాలి
రాజధాని ప్రాంతంలో అసెంబ్లీ, రాజ్భవన్, హైకోర్టు తదితర భవనాల నిర్మాణంతోసహా నవనగరాల రూపకల్పనలోనూ వేగం పెరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షాల విమర్శలకు మన పనితీరు, పారదర్శకతలే సమాధానం కావాలని అన్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా అమరావతిని భూతల స్వర్గంగా నిర్మిద్దామని, ఆంధ్రులు గర్వపడేలా చేద్దామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, సిఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సిఎండి (ఎడిసి) లక్ష్మీపార్థసారథి, ఇంధన, వౌలిక సదుపాయాలు, సిఆర్డిఏ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సిఆర్డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.