ఒక్క ఓటు వేరేవారికి వేసినా అన్యాయం చేసినట్లే...గ్రామదర్శిని ప్రారంభోత్సవంలో సిఎం చంద్రబాబు
అమరావతి:రాష్ట్రాన్ని ఎన్నో విధాల అభివృద్ది చేస్తున్న తనకు ప్రజలు అండగా నిలవాలని...ఒక్క ఓటు వేరే వారికి వేసినా అన్యాయం చేసినట్లేనని సిఎం చంద్రబాబు గుంటూరు జిల్లా పర్యటనలో పిలుపునిచ్చారు.
Recommended Video
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ గ్రామదర్శిని అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, టిడిపి శ్రేణులు స్వయంగా గ్రామాలకు వెళ్లేలా సిఎం చంద్రబాబు గ్రామదర్శిని అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వంద రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని సిఎం చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రారంభించారు.
సరికొత్త కార్యక్రమం...గ్రామదర్శిని
ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలపై గ్రామీణులకు అవగాహన కల్పించడమే కాకుండా, అధికార యంత్రాంగం పల్లెలకు తరలివచ్చే గ్రామదర్శిని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. తెదేపా అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామదర్శిని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్న వాటి పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా అధికారులే గ్రామాలకు తరలివెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా సిఎం చంద్రబాబు ఈ గ్రామదర్శిని కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కారం ప్రక్రియలో కేవలం అధికారులే కాకుండా స్థానిక టిడిపి శ్రేణులు సైతం పాలుపంచుకుంటాయి.
గ్రామదర్శిని...ప్రారంభం ఇలా
వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనెపూడిలో సిఎం చంద్రబాబు గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దోనెపూడిలో ముఖ్యమంత్రి స్వయంగా కాలినడకన పర్యటించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తారు. ఆ తరవాత గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. మూడు నెలల పాటు నిర్వహించే గ్రామదర్శిని కార్యక్రమంలో అధికారులు గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. అధికారులు బుధ, గురువారాల్లో గ్రామాలకు వెళ్లి గ్రామదర్శినిలో పాల్గొనాలని ఇప్పటికే వారికి ఆదేశాలిచ్చారు. అవసరమైతే అక్కడే బస చేసి గ్రామ సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
సిఎం చంద్రబాబు...ఏమన్నారంటే...
పోలవరం ప్రాజెక్టును సంవత్సరంలో పూర్తి చేస్తామని...కృష్ణానీళ్లు రాకున్నా పట్టిసీమ ద్వారా సాగునీరు ఇస్తున్నా మని గ్రామదర్శిని ప్రారంభోత్సవం సందర్భంగా సిఎం చంద్రబాబు చెప్పారు. "రాష్ట్రానికి ఇంత చేస్తున్న నాకు మీరంతా అండగా నిలబడాలి...ఒక్క ఓటు వేరేవారికి వేసినా అన్యాయం చేసినట్లే...కేంద్రం సహకరించనందునే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాము...మనమేమీ వారికి బానిసలంకాదు...మనమూ వారికి టాక్సులు కడుతున్నాం...మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతాం...అన్ని రంగాల్లోనూ దేశంలో మనమే నెంబర్ ఒన్...రానున్న రోజుల్లో ప్రపంచంలోనే మనమే నెంబర్ వన్ అవుతాము"...అని సిఎం చంద్రబాబు అన్నారు.
గ్రామదర్శినిపై...ప్రజల ఆశలు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గ్రామదర్శినిలో అధికారులు చురుగ్గా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కరించాలని సిఎం అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికను సిద్ధం చేసి వచ్చే జనవరిలో జరిగే జన్మభూమి గ్రామసభల్లో విజన్ డాక్యుమెంటును ప్రకటించాలన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం అనుకున్న రీతిలో నిర్వహిస్తే ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పల్లెల్లోని సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామస్థులు ఆశిస్తున్నారు.