నీతి ఆయోగ్ వైస్ చైర్మన్కు చంద్రబాబు లేఖ:గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని వినతి
అమరావతి: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రంజాన్ దృష్ట్యా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఈనెల 18కి వాయిదా వేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఒకవేళ 18కి వాయిదా వేయలేని పక్షంలో కనీసం 17వ తేదీ మధ్యాహ్నానికైనా సమావేశాన్ని వాయిదా వేయాలని చందబాబు లేఖలో కోరారు. నీతి ఆయోగ్ 4వ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చంద్రబాబు ఆ లేఖలో వెల్లడించారు. అయితే 16న రంజాన్ పండుగ, 17 ఉదయం ఈద్ మిలాప్ కార్యక్రమాలున్నాయని, అందువల్ల తాను అమరావతిలో ఉండటం ఎంతైనా అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.
బుధవారం ఉదయం చంద్రబాబు నీతి అయోగ్ సమావేశం కొరకు సిద్దపాటు విషయమై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విభజన అంశాలు, ప్రాజెక్టుల పురోగతి, కేంద్ర సాయంపై తన ఛాంబర్లో అధికారులతో సమీక్షించిన చంద్రబాబు...ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు.