స్కూల్లో పాఠం చెప్పిన బాబు, జవాబు కోసం పట్టు: అక్కడే వెంకయ్య క్లాస్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు టీచర్గా మారారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం ఆత్కూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'విద్యాంజలి' కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా చంద్రబాబు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. పాఠశాలలోని ఓ తరగతి గదిలోకి వెళ్లిన చంద్రబాబు ఉపాధ్యాయుడు కూర్చుండే సీటులో కూర్చున్నారు. కళ్లద్దాలు పెట్టుకుని మాస్టారులా మారిపోయారు. ఓ పుస్తకాన్ని తీసుకొని విద్యార్థులకు ఓ పాఠం చెప్పారు.
దురాశ దుఖానికి చేటు అనే నీతి కథను చెప్పారు. ఆ కథను చెప్పిన తర్వాత, మీరు ఈ పాఠం నుంచి ఏం నేర్చుకున్నారని విద్యార్థులను అడిగారు. పాఠం చెప్పే సమయంలో చంద్రబాబు పాఠాన్ని ఆసాంతం చదివి, దానిని వివరించారు.
కథను చదువుతూ.. మధ్య మధ్యలో దానిని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. పాఠం అయ్యాక విద్యార్థులను ప్రశ్నించారు. ఏం నీతి తెలుసుకున్నారో చెప్పాలని అడిగి, విపులీకరించారు. తొలుత విద్యార్థులు కాస్తంత బెరుకుగా నోరు మెదపకున్నా.. చంద్రబాబు చొరవతో సమాధానాలు చెప్పారు.
విద్యార్థుల నుంచి పూర్తి స్థాయిలో సమాధానాలు రాబట్టిన తర్వాత గాని చంద్రబాబు అక్కడి నుంచి కదలలేదు. ఈ మొత్తం వ్యవహరాన్ని చంద్రబాబు పక్కనే కూర్చున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆసక్తిగా పరిశీలించారు.
అదే పాఠశాలలో వెంకయ్య పాఠాలు
చంద్రబాబు పాఠాలు చెప్పిన స్కూల్లోనే కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు కూడా పాఠాలు చెప్పారు. వడ్రంగి - సింహం కథను అతను చెప్పారు. వెంకయ్య పాఠం చెబుతుండగా విద్యార్థులు ఆసక్తిగా విన్నారు.
నేను, చంద్రబాబు కష్టపడి పైకొచ్చాం: వెంకయ్య
తాను, చంద్రబాబు నాయుడు కష్టపడి పైకి వచ్చామని వెంకయ్య అన్నారు. కష్టపడి ఎదగాలని వెంకయ్య అన్నారు. అబ్దుల్ కలాం, నరేంద్ర మోడీనే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. చంద్రబాబు, మేం కూడా కష్టపడి పైకొచ్చామని చెప్పారు. వీరిద్దరు స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణభారతి సేవలను చంద్రబాబు కొనియాడారు.