నేడు ఎపి క్యాబినెట్ సమావేశం..జగన్ పై దాడి గురించి చర్చ:మంత్రులకు పవన్ ప్రశ్న..లోకేష్ జవాబు
అమరావతి:నేడు ఎపి క్యాబినెట్ మీటింగ్ సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై జరిగిన దాడితో సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే వివిధ పట్టణాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు, భూ కేటాయింపులు వంటి అంశాలపై కూడా నేడు మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో దళితుల భూముల్లో మట్టిని తవ్వి అక్రమాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రులను ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అవినీతి ఆరోపణలపై స్పందించిన మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా బదులిస్తూ మోడీ దత్త పుత్రుడు పవన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నేడే క్యాబినెట్ భేటీ...కీలక చర్చలు
సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపక్షనేత జగన్ పై జరిగిన దాడి గురించి ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన జగన్పై కోడి కత్తితో దాడి ఘటన గురించి అన్ని కోణాల్లో సమగ్రంగా చర్చించి ఆ తరువాత హోంమంత్రి చినరాజప్ప లేదా మంత్రి కాల్వ శ్రీనివాస్ మీడియాకు సమాచారం అందిస్తారని సమాచారం. అలాగే సిఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటన విశేషాలను నేడు క్యాబినెట్ సమావేశంలో మంత్రి వర్గ సహచరులకు వివరిస్తారని తెలిసింది.
కీలక నిర్ణయాలు...భూ కేటాయింపులు
అలాగే మచిలీపట్నం, ఏలూరు, కడప, ఒంగోలులో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుపై నేడు మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు ఇనామ్ యాక్ట్ 2013, ఏపీ అసైన్మెంట్ యాక్ట్ 1977కు చట్టసవరణపై చర్చ జరపనున్నారు. గ్రామీణ ప్రాంతాలకూ అన్నా క్యాంటీన్ల విస్తరణ, ప్రకాశం జిల్లా దొనకొండలో ఇండస్ట్రియల్ మెగా హబ్ ఏర్పాటు, పలు జిల్లాల్లో భూకేటాయింపులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఏపీఐఐసీకి 2,400 ఎకరాలు కేటాయింపుపై చర్చ జరుపుతారు.
మంత్రులకు...పవన్ ప్రశ్నలు
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదిలా ఉంటే తూర్పు గోదావరి జిల్లా ప్రజాపోరాట యాత్ర సందర్భంగా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ సూరంపాలెంలో దళితుల భూములు తవ్వుకొని రూ.కోట్లు దోచుకున్నారని, మట్టిని తవ్వుకుపోతుంటే మంత్రులు చినరాజప్ప, యనమల ఏం చేస్తున్నారని నిలదీశారు. అలాగే మట్టి తవ్వకాలపై జగన్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.సీఎం, మంత్రులు, విపక్ష నేతలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని పవన్కల్యాణ్ ఆరోపించారు.
ట్విట్టర్ లో...లోకేష్ స్పందన
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోడీ దత్త పుత్రుడు పవన్ తమపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అవినీతి అని గగ్గోలు పెట్టి ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని దుయ్యబట్టారు. ఇప్పుడు మరోసారి బాక్సైట్ పేరుతో తమకు మసి పూయాలని చూస్తున్నారని, పదవి కోసం తప్పుడు ప్రచారం మాని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని పవన్ కు లోకేష్ మరోసారి సవాల్ విసిరారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్పై ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడంలేదని పవన్ ను లోకేష్ నిలదీశారు.