ఎలా ముందుకెళ్దాం?...నేడు ఎంపీలతో చంద్రబాబు స్పెషల్ మీటింగ్...అన్నీఇస్తేనే...
అమరావతి: ఆదివారం టీడీపీ ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తాజా ఢిల్లీ పరిణామాలు, వచ్చే పార్లమెంట్ సమావేశాలుల్లోపు ఏపీకి రావాల్సిన నిధులన్నీఇచ్చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఇకపై కేంద్రం పట్ల వ్యవహరించాల్సిన తీరు తదిదర విషయాలపై చర్చించేందుకు సిఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై ఎపి వర్గాల నుంచి ఎదురైన తీవ్ర ప్రతిఘటన, మిత్ర పక్షం టిడిపి నుంచి హెచ్చరికల హోరు పార్లమెంటును కుదిపి వేయడంతో కేంద్రం దిగి వచ్చి కొన్ని ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు ఎంపీలతో జరగనున్నప్రత్యేక సమావేశంలో కేంద్రం స్పందన విషయమై నిశితంగా చర్చించాలని టిడిపి అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. వచ్చే రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపు కేంద్రం ప్రకటించిన విధంగా ఆ హామీలు అమల్లోకొస్తే కేంద్రానికి ధన్యవాదాలని...లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చెయ్యాలని టిడిపి యోచనగా తెలుస్తోంది.
నిశిత పరిశీలన...అధినేత విశ్లేషణ...
ఎపికి అన్యాయంపై నిరసనల కాక కేంద్రాన్ని గట్టిగానే తాకడంతో కేంద్రం స్పందించి కొన్ని హామీలను ప్రకటించిన నేపథ్యంలో...టిడిపి అధినేత చంద్రబాబు శనివారం సాయంత్రం ఎంపీలు కొనకళ్ల, కేశినేని నానితో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటి గురించి చంద్రబాబు వివరంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆదివారం పార్టీ ఎంపీలందరితో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. బడ్జెట్లో ఎపికి అన్యాయం కారణంగా కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న టిడిపి ఆ ప్రభుత్వం పైనే తిరుగుబాటు చేసే వరకు వెళ్లడంతో తదనంతర పరిణామాలపై ఎంపీల తో చర్చించడం ద్వారా టిడిపి అధినేత చంద్రబాబు అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
సుజనా చౌదరితో...ఏకాంత భేటీ?...
ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి సుజనా చౌదరితో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ ఏకాంత భేటీలో తమ ఆందోళనల పట్ల బిజెపి నేతల ప్రతిస్పందన, కేంద్రం హామీల అమలు...పురోగతి తదిదర విషయాలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా మిత్ర పక్షంగా ఉండి తాము తప్పనిసరి పరిస్థితుల్లో భాగ స్వామ్య పార్టీపైనే తిరుగుబాటుకు దిగిన నేపథ్యంలో తలెత్తే పరిణామాలు ఎలా ఉండొచ్చనేది కేంద్రంలో కీలక నేతలతో మాటా మంతి జరిపిన సుజనా చౌదరితో సమావేశం ద్వారా ఒక అంచనాకు రావచ్చనేది ఈ సమావేశం ఏర్పాటు చెయ్యడానికి కారణంగా కనిపిస్తోంది.
ఆచితూచి అడుగు...ఎలా వేద్దాం ముందడుగు?
విభజన హామీల అమలుకు సంబంధించి పార్లమెంటులో ఆందోళనల పర్వం నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ఎంతమేరకు ఆచరణలోకి వస్తాయో నిశితంగా పరిశీలించాలని టిడిపి భావిస్తోంది. హామీల అమలుకు గతంలో లాగా సుదీర్ఘ కాలం వేచి చూడటం కాకుండా రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపు కేంద్రం ప్రకటించిన హామీలన్నీ అమల్లోకి వస్తాయో రావో చూడాలని, లేకుండా తీవ్ర నిర్ణయానికైనా వెనుకాడకూడదని మెజారిటీ తెలుగు దేశం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
లోలోపల...అనుమానమే...
లోలోపల...అనుమానమే...టిడిపికి...లోలోపల...అనుమానమే...టిడిపికి...అయితే ఎపి ఎంపిల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం స్పందనపై టిడిపి అన్ని కోణాల్లోంచి ఆలోచన చేస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్, దుగరాజపట్నం బదులుగా రామాయపట్నంలో నౌకాశ్రయ నిర్మాణం, అమరావతికి మరిన్ని నిధులు, ఈఏపీలకు బదులుగా అంతర్గతంగానే ఆర్థిక సంస్థల నుంచి నిధుల కేటాయింపులు, పునరావాసంతో సహా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా అవసరమైన నిధులు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్...ఇలా కేంద్రం తాజాగా ఇచ్చిన పలు కీలకమైన హామీలు ఏ మేరకు...ఎళా ఆచరణలోకి వస్తాయో నిశితంగా పరిశీలించాలని టిడిపి భావిస్తోంది. పైగా గతంలో ఈ తరహా హామీలపై బిజెపి చరిత్ర పరిశీలిస్తే ఎపికి అంత పాజిటివ్ గా ఉన్నట్లు కనిపించకపోవడమే టిడిపిని మరింత లోతుగా ఆలోచించేలా చేస్తోంది.
మరోవైపు ...బిజెపిలో...అసహనమే...
మరోవైపు మిత్రపక్షంగా ఉంటూనే టిడిపి తమ పట్ల వ్యవహరించిన వైఖరి బిజెపి అగ్ర నేతలకు రుచించలేదని తెలుస్తోంది. భాఘస్వామ్య పార్టీయే తమకు వ్యతిరేకంగా పార్లమెంటు లోపలా, బయటా నిరసన వ్యక్తం చేయటం భాజపా నేతలకు మింగుడుపడటం లేదని సమాచారం...వివిధ కారణాల దృష్ట్యా బిజెపి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎపితో వివాదాన్ని ఇంకా పొడిగించడం మంచిది కాదనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని ఇప్పటికి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకుందని తెలుస్తోంది.
ఆ బాధ్యత...కుటుంబరావుకు...
కేంద్రం హామీల నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరిపే బాధ్యతను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. ఈఏపీలకు బదులుగా ఇతర రూపాల్లో నిధుల సర్దుబాటు చెయ్యాలని కేంద్రం నిర్ణయించడంతో ఆ విషయమై ఎపికి అనుకూల చర్యలు చేపట్టేలా జాగ్రత్త వహించడం, 2014-15 సంవత్సరపు ఆర్థిక లోటు భర్తీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించేందుకు కృషిచేయడం వీటి విషయమై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చేవారంలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది.