కాంగెస్లో ఉండి రాష్ట్రాన్ని ముంచిన నేతలే ఇప్పుడు బిజెపిలో...టిడిపి భయపడదు:చంద్రబాబు
శ్రీకాకుళం:టిడిపి భయపడే పార్టీ కాదని, కాంగెస్లో ఉండి రాష్ట్రాన్ని ముంచిన నేతలే ఇప్పుడు బిజెపిలో ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఏరువాకతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదన్నారు. నాలుగేళ్లు ఓపికపట్టామని, కేంద్రం తీరులో మార్పు రాకపోవటంతో తిరుగుబాటు చేశామని చెప్పారు. కేంద్రం విభజన హామీలను అమలుచేయడం లేదన్నారు. బిజెపి నమ్మించి మోసం చేసిందని విమర్శించారు.
పంచెకట్టుతో...ఏరువాకలో సిఎం
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఆమదాలవలస మండలం రావికంటపేటలో ఏరువాక కార్యక్రమాన్ని ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పచ్చ, బంగారు రంగులు మేళవించిన తల పాగా,పై పంచ, తెల్లటి పంచెకట్టు వస్త్రధారణతో చంద్రబాబు ఏరువాక లో పాల్గొన్న తీరు టిడిపి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
ఏరువాకలో...ట్రాక్టర్ నడిపిన సిఎం
రావికంటపేట గ్రామం వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమం ప్రారంభించిన చంద్రబాబు ఈ సందర్భంగా టాక్టర్ను నడిపారు. ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్ లా చంద్రబాబు ట్రాక్టర్ నడిపిన తీరు చూపరులను ఆశ్చర్యపరిచింది. అనంతరం ఆయన రైతులతో కలిసి నాట్లు వేశారు. ఆ తరువాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన చంద్రన్న రైతు బీమా పథకాన్ని జగ్గుశాస్త్రులపేటలోని ఎన్టీఆర్ గ్రీన్ఫీల్డ్ స్టేడియం వద్ద చంద్రబాబు ప్రారంభించారు.
బహిరంగ సభ...సిఎం ధ్వజం
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ బిజెపిపై విమర్శల వర్షం కురిపించారు. బిజెపి నమ్మించి మోసం చేసిందన్నారు. కేసులకు భయపడి వైసిపి కేంద్రంతో లాలూచీ పడిందని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాకు ఉక్కు కర్మాగారం అడగలేని దుస్థితి వైసిపిదని విమర్శించారు. టిడిపి భయపడే పార్టీ కాదని, కాంగెస్లో ఉండి రాష్ట్రాన్ని ముంచిన నేతలే ఇప్పుడు బిజెపిలో ఉన్నారని చెప్పారు.
తెలంగాణ తరహా...కానే కాదు
వైసిపి, జనసేన పార్టీలు బిజెపి నేతల అద్దె మైకులుగా మారాయని చంద్రబాబు విమర్శించారు. ఉత్తరాంధ్రలో తెలంగాణ తరహా ఉద్యమం వస్తుందని పవన్ అంటున్నాడు కాని ఉత్తరాంధ్ర టిడిపికి కంచు కోటని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి టిడిపి హయాంలోనే జరిగిందన్నారు.