దాచేపల్లి బాధితురాలి వద్దకు సీఎం: నన్నపనేని కంటతడి, ఖబడ్దార్ అని హెచ్చరిక
గుంటూరు: సంచలనం సృష్టించిన దాచేపల్లి అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. నిందితుడు సుబ్బయ్య చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని శుక్రవారం పలువురు పరామర్శించారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, సమాజంలో తిరిగే కొంతమంది మానవ మృగాల పట్ల మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఘటన పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పదిమందికి మంచి చెప్పే నేను, చేయకూడని పని చేశా: ఆత్మహత్యకు ముందు దాచేపల్లి నిందితుడు
ప్రాణహానీ ఉంది
బాలిక తండ్రి, చిన్నాన్న మాట్లాడుతూ.. చట్టాలలో మార్పులు తీసుకు రావాలన్నారు. నిందితుడి కుమారుడితో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. ఈ విషయాన్ని వారు డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లారు. దాచేపల్లిలో బాలికపై జరిగిన అత్యాచారానికి రాజకీయ రంగు పులమడం దారుణం అని మంత్రులు నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు విమర్శించారు.
పరామర్శించిన జానీమూన్
బాధితురాలి బంధువులను జడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ శుక్రవారం కలిశారు. బాధిత కుటుంబ సభ్యులు అందరూ స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారని తెలిసి ఆమె అక్కడకు వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పాప చదువుతో పాటు సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ఉండదండగా ఉంటుందన్నారు.
దిష్టిబొమ్మ దగ్ధం
గురజాలలో పలువురు సుబ్బయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓ వైపు సుబ్బయ్య మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తుండగా, అఖిల పక్ష నేతలు దిష్టిబొమ్మను కాల్చివేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సుబ్బయ్య చివరకు తనకు తానే శిక్ష వేసుకొని చనిపోయాడని, కామాంధులకు ఇదో గుణపాఠమని అంటున్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి
అత్యాచార ఘటనలకు పాల్పడిన వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి, గల్ఫ్లో మాదిరిగా ఉరితీయాలని దాచేపల్లి బాలిక చిన్నాన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఒంటరిగా ఉన్న బాలికను మీ అమ్మమ్మ ఇంటికి తీసుకు వెళ్తానని నమ్మించి సుబ్బయ్య తన ఇంటికి తీసుకు వెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారన్నారు. కథువా, ఉన్నావ్ ఘటనల్లో బాధితులకు జరగని న్యాయం, తమకు జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల సహాయసహకారాలు అందించిందన్నారు.
ఖబడ్దార్ అని హెచ్చరిక
ఈ అత్యాచార ఘటనను రాజకీయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఖబడ్దార్! తప్పుడు రాజకీయాలు చేసే పార్టీలనూ వదిలిపెట్టనని, తమాషాలు చేయవద్దని, నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. దాచేపల్లి ఘటనలో నేరస్తుడి తమ్ముడి కుమారుడు వైసీపీ నాయకుడు అని, గత ఎన్నికల్లో వారి కుటుంబ సభ్యులంతా ఆ పార్టీకే పని చేశారని, కానీ వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. బెట్టింగ్లు, ఏటీఎంలలో డబ్బులు కొట్టేయడం, దొంగ నోట్లు మార్చడం వంటి నేరాల్ని వైసీపీ నాయకులు అలవాటుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా తప్పు తప్పేనని, శిక్ష తప్పదన్నారు.