సవాళ్లు, సంక్షోభం: కలెక్టర్ల సదస్సులో చరిత్ర సృష్టించామన్న బాబు
అమరావతి: నీటి భద్రత ఉంటే ఎలాంటి సమస్యలు రావని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రోజుల ఏపీ కలెక్టర్ల సదస్సు బుధవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సంక్షోభావాలను సవాళ్లుగా తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామన్నారు. నీటి పారుదల రంగంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. భూగర్భ జలాలను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. వర్షపు నీటిని కాపాడుకోగలిగితే అభివృద్ధి సాధ్యమని అన్నారు. స్వల్ప కాలంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించామన్నారు.
వాటర్ గ్రిడ్ ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. నదుల అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా కేంద్రం చేసిందన్నారు. పోలవరం స్పిల్ వే నిర్మాణాన్ని ఏర్పాటు చేశామన్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు ఉండదన్నారు.
అనంతపురంలో రెయిన్ గన్లతో పంటలను కాపాడామన్నారు. రైతులకు అండగా నిలిచామన్నారు. ఏడాదికి రూ. 8వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చిందన్నారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు.
చంద్రబాబు అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకోడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంపై చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రణాళికా విభాగం రూపొందించిన 3 పుస్తకాలను ఈ సందర్భంగా సీఎం ఆవిష్కరించారు.
ఈ కలెక్టర్ల సదస్సుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్తో పాటు రాష్ట్ర మంత్రులు చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్బాబుతో పాటు పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.