అందుబాటులో ఉన్న మంత్రులతో సిఎం చంద్రబాబు కీలక భేటీ...తాజా పరిణామాలపై చర్చ
అమరావతి:కేంద్రంలో సిబిఐ రగడ, తెలంగాణా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులతో కీలక భేటీ అయ్యారు.
ఇదే సమావేశంలో అగ్రిగోల్డ్పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేష్, చినరాజప్ప, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ప్రైవేట్ బ్యాంకర్లు కూడా రుణాలిచ్చేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా బ్యాంకర్లను కోరారు.
బ్యాంకర్లతో...సిఎం సమావేశం
అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ నిర్దేశిత రుణ ప్రణాళికకు అనుగుణంగా బ్యాంకులు లక్ష్యాలను పూర్తి చేసి, ఫలితాలు సాధించడం ముఖ్యమని అన్నారు.
లక్ష్యానికి...అనుగుణంగా
వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా వ్యవసాయ రంగానికి ఈ ఏడాది రూ.1,01,564 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా మొదటి త్రైమాసికంలో రూ.31,007 కోట్లు ఇచ్చామని బ్యాంకు అధికారులు సిఎంకు తెలిపారు. బ్యాంకర్లు ఎంఎస్ఎంఈలకు తొలి త్రైమాసికంలో రూ.9,715 కోట్ల రుణాలు ఇవ్వగా 34.38శాతం లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. మిగిలిన ప్రాధాన్య రంగాలకు తొలి త్రైమాసికంలో రూ.2,035 కోట్ల రుణాలు ఇవ్వగా, 14.14 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు వివరించారు.
కౌలు రైతులకు...రుణాలు
ముఖ్యమంత్రి సూచనకు అనుగుణంగా బ్యాంకులు తొలిసారిగా కౌలు రైతులకు భారీగా రుణాలు ఇచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7,500 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా...మొదటి అర్ధ సంవత్సరంలోనే 33.74 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. మొత్తం 2 లక్షల 52వేల 756 మంది కౌలు రైతులకు రూ. 2,530.24 కోట్ల రుణాలు అందజేశాయి. వ్యవసాయ, ఇతర రుణాలు ఇచ్చే విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
ప్రభుత్వం ఇల్లు...పేదవాడి ఆస్తి
నిర్దేశిత రుణ ప్రణాళికకు అనుగుణంగా బ్యాంకులు లక్ష్యాలను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పేదలకు నిర్మించే గృహ సముదాయాలకు రూ. కోట్లు ఖర్చుపెట్టి అద్భుతంగా మౌలిక వసతుల కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నిర్మించే ఇల్లు పేదవారికి పెద్ద ఆస్తిగా ఉండాలనేది తన ఆశయమని, బ్యాంకులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని చంద్రబాబు సూచించారు.