108 ఉద్యోగులకు గుడ్న్యూస్...వేతనాల పెంపుకు సిఎం ఓకే
అమరావతి:ఎట్టకేలకు 108 వైద్య సిబ్బంది డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. 108 సిబ్బంది వినతి మేరకు వారికి వేతనాలు పెంచుతామని, వారి విన్నపాలను సానుభూతితో పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును 108 కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు కలిశారు. తమకు 50% జీతాలు పెంచాలని సీఎంను కోరారు.వైద్య సిబ్బంది వినతులపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు త్వరలోనే జీతాలు పెంచేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ సందర్భంగా 108 వైద్య సిబ్బందికి సిఎం చంద్రబాబు పలు సూచనలు చేసినట్లు తెలిసింది.
క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించడంలో మరింత చురుగ్గా వ్యవహరించి మీరు మంచిపేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని ముఖ్యమంత్రి ఉద్బోధించినట్లు సమాచారం.అలాగే 108 ఉద్యోగులు కోరుతున్నవిధంగా వారికి 8 గంటల డ్యూటీ విధానం సాధ్యం కాదని, వారు ఎమర్జెన్సీ సేవలు అందించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు షిప్టుల్లో పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం.