కరణంకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్!: మినీ మహానాడు ఘటనపై ఆరా, తీవ్ర అసహనం
అమరావతి: టీడీపీ నేతల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే శనివారం ఒంగోలులో జరిగిన మినీ మహానాడులో కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై ఆదివారం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పార్టీ బలోపేతానికి తానెంతగానో కృషి చేస్తుంటే కొత్తగా పార్టీలో చేరిన నేతలతో కలిసికట్టుగా ముందుకు సాగాల్సింది పోయి సీనియర్లే ఘర్షణకు దిగడం ఏంటని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఒంగోలులో టీడీపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న సంఘటనపై చంద్రబాబు ఆరా తీశారు.
కరణం, గొట్టిపాటి వర్గీయలు ఘర్షణ: మంత్రి సమక్షంలో బుచ్చయ్య చౌదరిపై దాడికి యత్నం
మినీ మహానాడులో కరణం బలరాం బలప్రదర్శనపై తీవ్ర స్థాయిలో మండిపడినట్టు సమాచారం. విబేధాలుంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలని నేతలకు ఆయన సూచించారు. అలా కాకుండా బహిరంగంగా దౌర్జన్యాలకు దిగడం సరికాదని కార్యకర్తలకు, నేతలకు సూచించారు.
ఇకపై పార్టీలో నేతల మధ్య కొట్లాటలను సహించేదిలేదని ఆయన తేల్చిచెప్పారు. ఘర్షణ వైఖరిని మార్చుకోని నేతలు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని ఆయన ఆదివారం ప్రకాశం జిల్లా నేతలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వరాదని సీఎం జిల్లా మంత్రిని, సీనియర్ నాయకులకు మార్గనిర్దేశం చేశారు. మినీ మహానాడులో చోటు చేసుకున్న పరిణామాలపై నివేదిక ఇవ్వాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆదేశించారు.
కాగా, తిరుపతిలో జరిగే మహానాడుకు సన్నాహాకంగా అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జి కరణం వెంకటేశ్ నేతృత్వంలో శనివారం ఒంగోలులో చేపట్టిన మిని మహానాడు రసాభాసగా మారింది. కరణం బలరాం, గొట్టిపాటి రవి వర్గీయలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన కరణం బలరాం వర్గీయులు ముందుగా జై బలరాం అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఈ నినాదాలకు పోటీగా గొట్టిపాటి అనుచరులు కూడా తామేమీ తక్కువ తినలేదని పోటాపోటీ నినాదాలు చేస్తూ బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘర్షణ మొత్తం కూడా మంత్రి రావెల కిశోర్ బాబు సమక్షంలో జరగడం విశేషం. కాగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింత పెద్దది కాకుండా చూడాలన్న ఉద్దేశంతో, అక్కడే ఉన్న పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇరు వర్గాల మధ్యకు వెళ్లి వారించేందుకు ప్రయత్నించగా, కరణం బలరాం ఆయనతో వాగ్వాదానికి దిగారు.
మరోవైపు ఉన్నత విద్యా పథకానికి తన పేరు పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇకపై పథకాలకు పేర్లు పెట్టే ముందు సీఎం కార్యాలయం అనుమతి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది.