డిజిపి నివేదికతో ఏకీభవించని సిఎం చంద్రబాబు?:పొలిటికల్ క్రైమ్స్ విషయంలో మెరుగవ్వాలని సూచన
అమరావతి:లా అండ్ ఆర్డర్ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఏపి డిజిపి ఆర్పీ ఠాకూర్ ఇచ్చిన నివేదికపై సిఎం చంద్రబాబు పూర్తి సంతృప్తి చెందలేదని తెలిసింది.
కొన్ని విషయాల్లో నివేదిక లోని అంశాలతో డిజిపితో సిఎం చంద్రబాబు ఏకీభవించలేదని సమాచారం. శుక్రవారం అమరావతిలో కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతి భద్రతల సమీక్షలో డిజిపి ఠాకూర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పొలిటికల్ నేరాలను అరికట్టే అంశంపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...పొలిటికల్ క్రైమ్స్ అరికట్టే విషయంలో పరిస్థితి మరింత మెరుగవ్వాల్సి ఉందని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...సాధారణ నేరాలను అరికట్టే విషయంలో పోలీసు యంత్రాంగం సమర్ధవంతంగా ఉన్నా...పొలిటికల్ క్రైమ్స్ అరికట్టే విషయంలో పరిస్థితి మెరుగవ్వాలని సూచించారు. వచ్చే ఆరు నెలల కాలంలో రాజకీయ నేరాలకు ఎక్కువగా ఆస్కారం ఉందని పోలీసు అధికారులకు తెలిపి... ముందు జాగ్రత్త చర్యలతో అప్రమప్తంగా వ్యవహరించాలన్నారు.
నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో రాజకీయపరమైన ఆందోళనలతో నాయకులు రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తే వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని సిఎం చంద్రబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళలపై నేరాల నియంత్రణకు ప్రతిగ్రామంలో ఒక సమన్వయకర్త ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఏదైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ధైర్యంగా వ్యవహరించాలని...ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. గవర్నర్ వ్యవహార శైలి కూడా సరిగా లేదని.. జగన్పై దాడి విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నేరుగా డీజీపీనే నివేదిక అడగడం ఏంటని ఈ సమావేశంలో సిఎం చంద్రబాబు ప్రశ్నించారు. గవర్నర్ నేరుగా అధికారులనే సంప్రదిస్తే ఇక తామెందుకుని అన్నారు.