ఆడపిల్లల సంఖ్య తగ్గడంపై చంద్రబాబు ఆందోళన: మహిళలకు వరాలు
కర్నూలు: సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతోందని, ఆడబిడ్డల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన హాజరై మహిళలకు వరాల జల్లు కురిపించారు.
మహిళా విశ్వవిద్యాలయం పెట్టి ఎన్టీఆర్ మహిళలకు మేలు చేశారని, ఐటీ కంపెనీల్లో ఆడపిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని, కట్నాల బెడద కొంతవరకు తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో డ్వాక్రా సంఘాలు చరిత్ర సృష్టించబోతున్నాయని, రెండు వేల మంది ఇతర రాష్ట్రాల్లో మోటవేటర్లుగా ఉన్నారని పేర్కొన్నారు.
గత పదేళ్ల కాలంలో మహిళలు ఆదాయం పెంపుపై దృష్టి సారించలేదని, ఆదాయం వచ్చే పనులు చేస్తేనే ఉపయోగమని అన్నారు. త్వరలో డ్వాకా సంఘాలకు మాఫీ బకాయిలను అందిస్తామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ఆడపిల్లల గౌరవం కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదన్న ఆయన వాటి బాధ్యతను డ్వాక్రా సంఘాలు తీసుకోవాలని సూచించారు. డ్వాక్రా సంఘాలకు 50 వేల కిరాణం షాపులు, 10 వేల కుట్టుమిషన్లు అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఏపీలో 4 లక్షల మంది మహిళలకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించామన్నారు.
పెట్టుబడి నిధి కింద డ్వాక్రా సంఘాలకు రూ. 8,000 కోట్లు మంజూరు చేస్తామని అన్నారు. డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్కు ఉగాది నుంచి కొత్త పథకం అమలుచేయనున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు 20 పాయింట్ల కార్యక్రమం రూపొందించామని చెప్పారు.
అందులో కనీస చదువు, కంప్యూటర్ పరిజ్ఞానం, గ్యాస్తో వంట తదితర కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. 35 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత హెల్త్ చెకప్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
త్వరలో 200 మంది గైనకాలజిస్టు పోస్టులు భర్తీ చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మహిళల కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని అన్నారు. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ను రూపొందించడంతో పాటు, షీటీమ్స్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఆడపిల్ల పుడితే మంచిది కాదన్న భావన సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళల సమానత్వం రక్షణ కోసం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. యువతులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. బాల్యవ వివాహాల నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
అంతక ముందు మహిళా దినోత్సవం సందర్భంగా అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ స్టాల్స్ను చంద్రబాబు తిలకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, మృణాళిని, పీతల సుజాత, అచ్చెన్నాయుడుతోపాటు నన్నపనేని రాజకుమారి, శిల్పాసోదరులు, భూమా నాగిరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.