అందుకే కాపులకు రిజర్వేషన్లు: బాబు, అప్పుడేమైంది.. ఆర్ కృష్ణయ్యకు ప్రశ్నలు
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదివారం ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలను వారు ప్రస్తావించారు.
టి-టిడిపికి కాపు సెగ!: రిజైన్ చేస్తా.. బాబుకు ఆర్ కృష్ణయ్య షాక్, 'జగన్ దురదృష్టవంతుడు'
శనివారం ఏపీ అసెంబ్లీ కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీసీసంఘాలు భగ్గుమన్నాయి. అలాగే, కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా తమకు 9 శాతం కావాలని డిమాండ్ చేశారు. కాపులకు రిజర్వేషన్ల నేపథ్యంలో అవసరమైతే తాను టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కృష్ణయ్య హెచ్చరించారు.
ఆర్ కృష్ణయ్యపై ప్రశ్నలు
ఇదే విషయాన్ని టిడిపి నేతలు కొందరు అధినేత దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు ఆర్ కృష్ణయ్యపై ప్రశ్నలు కురిపించారు. తెలంగాణలో కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తొలగించినప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఇప్పుడు తాము బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఓటు బ్యాంకుగా చూడలేదు
చంద్రబాబుతో భేటీ సందర్భంగా కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళన, మంజునాథ కమిషన్ వివాదం తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీసీలను, కాపులను టీడీపీ ఎప్పుడు ఓటు బ్యాంకులుగా చూడలేదని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు తమ రాజకీయ లబ్ధి, తమ స్వార్థం కోసం కులాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
అందుకే బిల్లు పెట్టాం
ఏ వర్గానికి అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. నిబంధల మేరకే అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టామని వెల్లడించారు.
బీసీ కమిషన్లోని మెజార్టీ సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
పరిణామాలు జాగ్రత్తగా గమనించండి
బీసీలకు రిజర్వేషన్లలో కోత లేదని చెప్పామని చంద్రబాబు అన్నారు. జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. చంద్రబాబు పలువురు నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళన, మంజునాథ వివాదంపై నేతలకు సూచనలు చేయడంతో పాటు ఈ వ్యవహారంపై నేతలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.