తిరుమల చేరుకున్న చంద్రబాబు...స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ:రేపు శ్రీశైలంలో పర్యటన
తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం మధ్యాహ్నం సమయానికి తిరుమలకు చేరుకున్నారు. అమరావతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి విమానంలో చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు.
కొండపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు టిటిడి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్కుమార్ సింఘాల్ తదితరులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం మకరలగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
తొలుత సుమారుగా రాత్రి ఏడు గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సకుటుంబ సమేతంగా బేడీ అంజనేయస్వామి మండపం నుంచి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పట్టువస్త్రాలను తీసుకొని మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారని తెలిసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి సకుటుంబ సమేతంగా తరలివచ్చిన నేపథ్యంలో టిటిడి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఇదిలావుంటే శుక్రవారం శ్రీశైలంలో జరిగే జలసిరి హారతి కార్యక్రమానికి సిఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాక నేపథ్యంలో శ్రీశైలంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో సభా స్థలం,సంబంధిత ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశం తదితరాలను స్థానిక శాసన సభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...శుక్రవారం జరిగే జలసిరి హారతి కార్యక్రమానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి 10 వేల మందితో ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. అలాగే సున్నిపెంట, శ్రీశైలంలో ఉండే సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరనున్నట్లు రాజశేఖర్ రెడ్డి తెలిపారు.