సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న సిఎం చంద్రబాబు; గుంటూరు జిల్లా గురజాలలో లోకేష్ పర్యటన
అనంతపురం:సత్యసాయి బాబాతో తనకున్న అనుబంధం అపురూమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 'మానవ సేవే మాధవ సేవ' అనే గొప్ప సత్యాన్ని ప్రపంచానికి చాటిన అద్భుతమైన వ్యక్తి సత్యాసాయిబాబా అని సిఎం చంద్రబాబు కొనియాడారు.
శుక్రవారం ఉదయం ఆయన అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయంకు చేరుకున్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం సాయి కుల్వంత్ హాల్లో ఉన్న బాబా మహా సమాధిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు.
ఆ తరువాత సత్యసాయి బాబా 99వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను సిఎం చంద్రబాబు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి బాబాతో తనకున్న అనుబంధాన్ని, జ్ణాపకాలను గుర్తుచేసుకున్నారు. సత్యసాయిబాబా అందించిన మహా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి అని, ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడికీ మనశ్శాంతితో పాటు, వారి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని సిఎం చంద్రబాబు చెప్పారు.
మరోవైపు ఏపీ పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శుక్రవారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో పర్యటించారు. మాడుగుల గ్రామంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును స్థానికులను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాడుగుల గ్రామంలో సబ్స్టేషన్, సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. అలాగే రూ.13 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని కూడా మంత్రి లోకేష్ ప్రారంభించారు. గురజాల, దాచేపల్లి పట్టణాల్లో మంత్రి లోకేష్ రోడ్ షోలు నిర్వహించి...అనంతరం పిడుగురాళ్లలో సాయంత్రం 5గంటలకు భారీ బహిరంగసభ నిర్వహిస్తారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పారు.