జగన్ ఇలాకాలో నీటిని విడుదల చేసిన బాబు, నాటకాలని వైసీపీ ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు కడప జిల్లా పులివెందులలో పర్యటించారు. పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు.
కడప: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు కడప జిల్లా పులివెందులలో పర్యటించారు. పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. దీని ద్వారా పులివెందుల బ్రాంచి కెనాల్కు నీటిని విడుదల చేసారు.
పులివెందులకు నీటిని ఇస్తామని, అప్పటి దాకా తాను గెడ్డం తీయనని ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజుతో ఆయన చేసిన సవాల్ నెరవేరింది. దీంతో ఆయన గెడ్డం తీయనున్నారు.
బాబుకు కడప తర్వాతే కుప్పం!: ఎన్ని కుట్రలు చేసినా.. కడపలో జగన్కు ఇలా చెక్
గతంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తన సొంత నియోజకవర్గం కుప్పం కంటే ముందుగా కృష్ణా జలాలను పులివెందులకు తీసుకు వస్తానని చెప్పారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కూడా ఇటీవల ఇదే విషయం చెప్పారు.
గండికోట రిజర్వాయర్..
గండికోట జలాయం నుంచి 9 సంపుల ద్వారా పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాలెం జలాశయానికి ఈ నీటి సరఫరా జరుగుతుంది. 77 మీటర్ల ఎత్తున సెకనుకు వెయ్యి క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. పైడిపాలెం రిజర్వాయర్ నీటి సామర్థ్యం ఆరు టీఎంసీలు.
పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండురుతో పాటు జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలాల్లో వేలాది ఎకరాల నూతన ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు పులివెందుల బ్రాంచా కాలువ కింద ఆయకట్టును స్థిరీకరించడం గండికోట ఎత్తిపోతల ప్రధాన ఉద్దేశ్యం.
పైడిపాలెం జలాశయానికి నీరు చేరాక.. అక్కడి నుంచి చిన్న కాలువల ద్వారా సాగునీరు అందించడానికి వీలవుతుంది. ఈ జలాశయం కింద 22 గ్రామాల్లోని నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టారు. గండికోటలో కనీసం 4.5 టీఎంసీల నీరు ఉంటే ఎత్తిపోత సాధ్యమవుతుంది.
కాగా, గండికోట రిజర్వాయరుకు 1995లో చంద్రబాబు, 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు.
రాయలసీమ నీటి పైన చంద్రబాబు నాటకాలని వైసిపి
రాయలసీమ నీటు పైన చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని వైసిపి మండిపడుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులకు గేట్లు చంద్రబాబు ఎత్తుతున్నారని, తన పేరు చెప్పుకుంటున్నారన్నారని అంటున్నారు.
గతంలో తొమ్మిదేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రాజెక్టుల ఊసు ఎత్తలేదని మండిపడుతున్నారు.
పైడిపాలెం రిజర్వాయర్ను జాతికి అంకితం చేసే పేరుతో కడప జిల్లాలోని గండికోట రిజర్వాయరుకు 3 టీఎంసీల నీటిని చంద్రబాబు విడుదల చేస్తున్నారని, ఇలా విడుదల చేయడం ఇది కొత్త కాదని, 2013లోనే అప్పటి కలెక్టర్ ఈ తరహాలో గండికోటకు నీటిని తీసుకు వచ్చారని పేర్కొంటున్నారు.