బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో రబీలో పంట ఎండకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం నీరు-ప్రగతిపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రబీ సమయంలో జలవనరులు, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు, సమన్వయంగా పనిచేయాలని సూచించారు. కాలువల పైనే అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడ ఏ స్థాయిలో పంటలు ఉన్నాయో పరిశీలించి అవసరాన్ని బట్టి సకాలంలో తడులు అందించాలని చెప్పారు. పంటలు కాపాడే బాధ్యత మూడు శాఖల అధికారులదేనని సీఎం తేల్చి చెప్పారు. ఉద్యాన తోటల పెంపకంతో మహిళా సంఘాల సభ్యుల సేవలు వినియోగించుకోవాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో సిమెంటు రోడ్డుల నిర్మాణ లక్ష్యం చేరుకోవాలని అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. సిమెంటు రోడ్ల నిర్మాణంలో ముందంజలో ఉన్న శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు యంత్రాంగాన్ని సీఎం అభినందించారు. రోడ్ల నిర్మాణాన్ని కృష్ణా, గుంటూరు అధికారులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో వారానికి 100కి.మీ సిమెంటు రోడ్ల నిర్మాణం జరగాలని, శాఖల మధ్య సమన్వయం, నిధుల సమీకరణ సక్రమంగా జరగాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రూ.5లక్షలతో ఆటస్థలం అభివృద్ధి చేయాలని, వచ్చే సంక్రాంతి సంబరాలను ఈ ఆటస్థలాల్లోనే నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, సెర్ఫ్ అధికారులు పాల్గొన్నారు.