శ్రీవారి దర్శనంపై సిఎం చంద్రబాబు దిశానిర్దేశం...స్వరూపానందేంద్ర సరస్వతి సందేహం
Recommended Video
అమరావతి:తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ సందర్భంగా దర్శనాన్ని నిలిపివేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. దర్శనం నిలిపివేత, పూజా కార్యక్రమాలు, భక్తులకు అనుమతి తదిదర విషయాలపై టిటిడికి దిశానిర్దేశం చేశారు.
పన్నెండేళ్లకొకసారి శ్రీవారి ఆలయంలో నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని వచ్చే నెల 9 నుంచి 17 వరకు నిర్ణయించేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈ కార్యక్రమం జరిగినన్ని రోజులు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిటిడి నిర్ణయం పై భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో సిఎం చంద్రబాబు ఈ విషయమై స్పందించారు.
మహాసంప్రోక్షణ రోజుల్లో ఆగమ శాస్త్రానుసారం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, పూజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన సూచించారు. అలాగే ఆ రోజుల్లో పరిమిత సంఖ్యలో దర్శనానికి భక్తులను అనుమతించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలను అనుసరించాలని తెలిపారు. రోజుల తరబడి భక్తులు దర్శనానికి ఎదురుచూసేలా చేయరాదని టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మరోవైపు మహా సంప్రోక్షణ పేరుతో తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం వెనుక కుట్ర దాగివుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుమానం వ్యక్తం చేశారు. సంప్రోక్షణ జరిగే సమయంలో సీసీ కెమెరాలను సైతం ఆపివేస్తామని టీటీడీ అధికారులు ప్రకటించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు.
నిజానికి ఆగమశాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ జరిగే విధానాన్ని భక్తులు తిలకించవచ్చని ఆయన చెప్పారు. ఆలయం మూసివేసే నిర్ణయం తీసుకునే ముందు టిటిడి అధికారులు కంచి, శృంగేరి పిఠాధిపతులతో సంప్రదించారా?...అని స్వరూపానందేంద్ర ప్రశ్నించారు. టిటిడి వ్యవహారాలు భక్తుల్లో అనుమానాలను పెంచుతున్నాయని స్వరూపానందేంద్ర ఆరోపించారు.