సిట్టింగ్ లు, ఆశావాహులపై సిఎం చంద్రబాబు సీక్రెట్ సర్వే...'ముందస్తు' ప్రభావమా!
అమరావతి:కాదుకాదంటూనే సిఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారా?..ఎందుకైనా మంచిదని ఆ దిశలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా?..ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేపట్టిన చర్యలు చూస్తే అదే నిజమనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు...
Recommended Video
ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ అందుకు సంసిద్ధంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో సిఎ చంద్రబాబు ఒక వైపు పార్టీ శ్రేణులను మరోవైపు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారట. ప్రత్యేకించి పార్టీని మళ్లీ విజేతగా నిలిపేందుకు...గెలుపు గుర్రాల అన్వేషణ కోసం చంద్రబాబు స్పెషల్ టీమ్లను రంగంలోకి దించారట. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఎంపీలతో పాటు ఆశావాహుల్లో సైతం గెలుపు గుర్రాలేవనేది తేల్చే సీక్రెట్ ఆపరేషన్ ఇదంటున్నారు.
సిఎం...సీక్రెట్ సర్వే
గెలుపు గుర్రాల అన్వేషణ కోసం చంద్రబాబు వినూత్న పంథాను అవలంభిస్తున్నారట...సర్వేలో నిష్ణాణుతులైన ఇద్దరు ప్రొఫెసర్లకు ఒక జిల్లా చొప్పున అన్ని జిల్లాల బాధ్యతలు అప్పగించేశారట. ఈ ప్రొఫెసర్లకు సిఎం చంద్రబాబు తానే స్వయంగా రూపొందించిన ఒక ప్రశ్నావళిని ఇచ్చారట...అందులో పది నుంచి పదిహేను ప్రశ్నలుంటాయని...వాటిని తీసుకొని ఈ ప్రొఫెసర్లు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుందని తెలిసింది.
ప్రశ్నలు...ఈ సమాచారం కోసం
సర్వేలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతూ...ప్రధానంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ఉన్న ఆరోపణలు, సానుకూల, ప్రతికూల అంశాలు, పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు?...ఎమ్మెల్యే అందరినీ కలుపుకుని వెళ్తున్నారా?...ఇసుక అక్రమ తవ్వకాల్లో తల దూర్చుతున్నారా?...ప్రజలకు ఆ ఎమ్మెల్యేపై ఉన్న అభిప్రాయం ఏమిటి...టికెట్ ఇస్తే మళ్లీ గెలుస్తారా? వంటి వివిధ ప్రశ్నలతో సర్వే ద్వారా ఈ ప్రొఫెసర్లు సమాచారాన్ని రాబడుతున్నారట
వాళ్లకి...ఫైనల్ వార్నింగ్
ఈ సర్వే పూర్తయ్యాక సిట్టింగ్ ప్రజాప్రతినిథులతో వచ్చే నెలలో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారట. ఆ తరుణంలో తాను సేకరించిన డాటాను వారి ముందుంచుతారని సమాచారం. నివేదికలో నెగిటివ్ రిపోర్టు వచ్చిన ఎమ్మెల్యేల చిట్టాను వారి ముందుంచి వారికి ఫైనల్ వార్నింగ్ జారీ చేస్తారని తెలిసింది. అయితే వారికి చివరి అవకాశంగా ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఆ సమయం లోగా పని తీరును మెరుగుపరుచుకోలేకపోతే టికెట్పై ఆశలు వదులుకోలని స్పష్టంగా చెప్పేస్తారని అంటున్నారు.
జరుగుతోంది...గెలుపు గుర్రాలకే ఛాన్స్
ఈ సర్వే ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తయిందని తెలిసింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం పోటీపడుతున్న వారి భారీగా ఉందట. కొత్తకొత్త అభ్యర్థులు తెర మీదకు రావడంతో పాటు నేతల వారసుల బెడద చాలా తీవ్రంగా ఉందట. మరోవైపు లోకేష్ వైపు నుంచి యువకుల టీమ్ కూడా భారీగా పెరుగుతోందట. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును సిఎం చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా తీసుకుంటున్నారట. పైగా బిజెపితో సహా ప్రతిపక్షాలన్నీ ఏకమై ముప్పేటదాడి చేసే అవకాశాలు కనిపిస్తుండటంతో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని పట్టుదలతో ఉన్నారట. అందుకే ఈసారి మొహమాటాలు, సిఫార్సులు, ఇతర ఈక్వేషన్లకు ఏమాత్రం తావుండకపోవచ్చని, కేవలం గెలుపు గుర్రాలకే ప్రయారిటీ అని తెలుస్తోంది.
అయితే...మార్పులు తప్పవా?...
ఇప్పటివరకు తమకు సంబంధించిన ప్రజాప్రతినిధుల గురించి సిఎం చంద్రబాబు సేకరించిన సమాచారం ప్రకారం 35 నుంచి 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పు చేయాల్సిన అవసరం ఉందని ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో కనీసం నాలుగు చోట్ల మార్పు అనివార్యమని సర్వేల ద్వారా వెల్లడయిందని సిట్టింగ్ నేతల్లో గుబులు రేగుతోందని తెలిసింది. ఇక తాజాగా ప్రొఫెసర్లు చేస్తున్న సర్వే నివేదిక రాగానే ఇక పార్టీ నాయకులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు ఏర్పాటుచేసి ఫైనల్ వార్నింగ్ లు ఇస్తారని తెలిసింది.
‘ముందస్తు'...ఎన్నికలు కోసమేనా?
ముందస్తు ఎన్నికలపై విస్తృత ప్రచారం నేపథ్యంలో ఏదేని కారణం చేత ఒకవేళ డిసెంబర్లోగా ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ఏ రకంగానూ వెనుకపడటానికి వీలులేకుండా చంద్రబాబు సన్నాహక వ్యూహం ఆరంభించారనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ నేతల్లో కూడా కొందరు ముందస్తుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు విడివిడిగా వెళ్తే ఖర్చు తడిసి మోపెడు అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని, అదే ఒకసారి అయితే ఆ ఒక్కసారి తోనే పోతుందనేది వారి అభిప్రాయంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పార్టీని టార్గెట్ చేసే విషయంలో తేడా ఉంటుందని, ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రత్యర్థులు పార్టీపై ఫోకస్ అంతగా పెట్టలేరనేది టిడిపి నేతలు అభిప్రాయంగా తెలుస్తోంది.