ఆ తర్వాతే లండన్ వెళ్తా : చంద్రబాబుకు రాజమౌళి, సచివాలయం అద్భుతం
అమరావతి డిజైన్ల విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకులు రాజమౌళి మూడుసార్లు భేటీ అయ్యారు. ఈ సమయంలో ఆయన తాత్కాలిక సచివాలయాన్ని కూడా పరిశీలించారు.
అమరావతి: అమరావతి డిజైన్ల విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకులు రాజమౌళి మూడుసార్లు భేటీ అయ్యారు. ఈ సమయంలో ఆయన తాత్కాలిక సచివాలయాన్ని కూడా పరిశీలించారు.
అందుకే బాబుతో ఎక్కువ సేపు మాట్లాడలేదు: రాజమౌళి, డిజైన్లపై మళ్లీ
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం బాగుందని రాజమౌళి కితాబిచ్చారు. సచివాలయం మొదటి బ్లాకులోని సీఎం చాంబరు, సమావేశపు గదులు, అసెంబ్లీ, మండలి భవనాలను పరిశీలించిన రాజమౌళి.. అద్భుతం అన్నారు.
డిజైన్ల గురించి పూర్తిగా ఆరా తీసిన రాజమౌళి
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఆకృతుల రూపకల్పనలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని రాజమౌళి వెల్లడించారు. డిజైన్ల పరంగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను రాజమౌళి తెలుసుకున్నారు. ప్రస్తుతం డిజైన్లు ఏ ప్రాతిపదికన రూపొందించారని అడిగి తెలుసుకున్నారు.
బయట చూసినా బాగుండాలి
ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాజధాని నిర్మాణ ఆకృతులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాజమౌళికి సూచించారు. బాహ్య స్వరూపం ఆకట్టుకునేలా ఉండాలన్నారు. రాజధాని నిర్మాణం ప్రపంచంలోని అగ్రనగరాల్లో ఒకటిగా ఉండాలన్నారు.
ఆ తర్వాతే లండన్ వెళ్తా: రాజమౌళి
ప్రజలందరూ ఆమోదించేలా ఉండాలని చంద్రబాబు చెప్పారు. లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులను కలిసేందుకు దర్శకుడు రాజమౌళి సుముఖత వ్యక్తం చేశారు. తొలుత నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం అవుతానని, ఆ తర్వాత లండన్ వెళతానని చెప్పారు.
రాజధాని ప్రాంతంలో రాజమౌళి పర్యటన ఇలా..
దర్శకుడు రాజమౌళి ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. వెలగపూడి సచివాలయానికి వెళ్లారు. అక్కడి శాసనసభ, ఇతర భవనాలను పరిశీలించారు. కరకట్ట మీదుగా ప్రయాణం చేసి రాయపూడిలో ప్రకాశం బ్యారేజీ బ్యాక్వాటర్ను పరిశీలించారు.
బోట్పై ప్రయాణం, ఫోన్లో ఫోటోలు
ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్ నుంచి నదిలో బోటుపై పున్నమి ఘాట్ వరకు ప్రయాణం చేశారు. ఆ ప్రాంతాలను సందర్శించారు. తాను తిరిగిన ప్రదేశాలను సెల్ ఫోన్లో బంధించారు. అనంతరం మూడో సారి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువకప్పి సీఎం సత్కరించారు.