అధికారులకు;మర్యాదగా చెబుతుంటే..ఎక్కడం లేదు...బి కేర్ ఫుల్:సిఎం చంద్రబాబు
అమరావతి: అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను సూటిగా హెచ్చరించారు. గత కొంతకాలం క్రితం వరకు అధికారుల పట్ల ఒకింత ఎక్కువగానే మెతక వైఖరి ప్రదర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి కాలంలో వారికి కఠిన హెచ్చరికలు జారీ చేస్తుండటం గమనార్హం.
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజుకు చేరుకుంది. అయితే కలెక్టర్ల సదస్సులో సిఎం చంద్రబాబు తొలి రోజే అధికారులపై పలు సందర్భాల్లో తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటి రోజు ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురైన జాబితాలో రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, మున్సిపల్ అధికారులతో పాటు కొందరు కలెక్టర్లు కూడా ఉన్నారు. తొలి రోజు ప్రధానంగా వివిధ ప్రభుత్వ శాఖల సమీక్షలకే ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం కేటాయించారు.
ఆర్ అండ్ బి మీద...ఆగ్రహం...మర్యాదగా చెబితే..
ఆర్ అండ్ బి శాఖ పై సమీక్ష సందర్భంగా కలెక్టర్లు ఆ శాఖకు సంబంధించి పలు సమస్యలు ఏకరువు పెట్టడంతో...ఒక దశలో అసహనం చెందిన సిఎం చంద్రబాబు...ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఉద్దేశించి..."మర్యాదగా చెబితే ఎవరికీ ఎక్కడం లేదు..చాలామంది ప్రతి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పుస్తకాలు చదవడం తప్ప...అందులోవి అమలు చేయడంపై దృష్టి పెట్టడం లేదు...ఇక్కడ పుస్తకాల్లో సంగతులు కాదు...ఫలితాల గురించి మాట్లాడాలి...కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి"...అన్నారు
సూటిగా...హెచ్చరికలు...మంత్రికి సూచన...
మరో సందర్భంలో..." ఆర్ అండ్ బి, నేషనల్ హై వేస్ పని తీరు బాగోలేదు...బీ కేర్ ఫుల్...రియాక్షన్ వేరేలా ఉంటుంది"...అని సిఎం చంద్రబాబు ఆ శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఆర్ అండ్ బి కి సంబంధించి ప్రతి ప్రాజెక్టులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాత కార్యదర్శి వెళ్లిపోయిన తరువాత ఆ శాఖ వెనుకబడిందని, ఆ శాఖను మళ్లీ దారిలో పెట్టాలని నేరుగా ఆ శాఖా మంత్రి అయ్యన్న పాత్రుడినే ఆదేశించారు.
మున్సిపల్ శాఖకు...తలంటు...
అనంతరం మున్సిపల్ శాఖ సమీక్ష సందర్భంగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యర్థాల నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ప్లాంట్ల గురించి చెబుతుండగా...సిఎం జోక్యం చేసుకున్నారు..."మూడున్నర ఏళ్లుగా ఈ ప్లాంట్ల గురించి చెబుతూనే ఉన్నారు...ఏదీ ఒక్కటైనా పూర్తయిందా?...ఇలాగైతే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం పోతుంది...అధికారులు మనసు పెట్టి పనిచేయాలి...అని హెచ్చరించారు. తాను స్వచ్చ భారత్ మిషన్ జాతీయ ఛైర్మన్ గా ఉన్నానని, మన రాష్ట్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా..అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్లకు చురకలు...కాన్ఫరెన్స్ కు వచ్చి...గూగుల్ లో చూడటం ఏంటి?...
ఈ వ్యర్థాల నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటుకు చిత్తూరు జిల్లాలో భూ సమస్య ఉందని మున్సిపల్ అధికారులు సిఎం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై స్పందించిన చంద్రబాబు తన సొంత జిల్లాపై ఉన్న అవగాహనతో పలు ప్రదేశాలు సూచించారు. ఆయా ప్రాంతాలను పరిశీలించాలని కలెక్టర్ ను ఆదేశించారు. కలెక్టర్ ఆ ప్రదేశాలను ఇప్పుడే గూగుల్ లో చూస్తున్నాను సర్ అని బదులిచ్చారు. దీంతో మరింత అసహనానికి గురైన సిఎం చంద్రబాబు..."కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు వచ్చిన తర్వాత గూగుల్ లో చూడటం ఏమిటని ప్రశ్నించారు. ముందుగానే అన్ని అంశాలపై సమాయత్తం కావాలని హెచ్చరించారు....కలెక్టర్ల కాన్ఫరెన్స్ తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా అధికారులపై ఫైర్ అవడంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు చర్చించుకుంటున్నారు.