ఎపిలో ఏం చేస్తున్నామంటే?....:వరల్డ్ సిటీ సమ్మిట్లో సీఎం చంద్రబాబు ప్రసంగం
సింగపూర్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. తొలిరోజు ఆ దేశపు మంత్రి మంత్రి వోంగ్ లోతో భేటీలో పాల్గొన్న చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సు ప్లీనరీలో పాల్గొన్నారు.
Recommended Video
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాధనాల ద్వారా నీటి వనరులు, ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత సమాచారాన్నితెలుసుకోవచ్చని చెప్పారు. అలాగే సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా రాష్ట్రంలో భూగర్భజలాలను పెంచగలిగామని తెలిపారు. నదుల అనుసంధానం, భూగర్భ జలాల పునర్ వినియోగం, వ్యర్థ నీటి నిర్వహణ చర్యలతో మెరుగైన ఫలితాలు సాధించామని వెల్లడించారు.
పునరుత్పాదక ఇంధనంపై ప్రధానంగా దృష్టి సారించామని చంద్రబాబు చెప్పారు. 5 లక్షల మంది రైతుల భాగస్వామ్యంతో జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్తున్నామని తెలిపారు .అలాగే ద్రవ, ఘన వ్యర్ధాల నిర్వహణను సమర్థమైన పద్ధతుల్లో చేపడుతున్నామని చంద్రబాబు వివరించారు. హరిత రాజధాని అమరావతిలో సాంకేతిక పద్దతులను వినియోగిస్తున్నామని...రాజధాని నగరం పరిధిలో 5-10-15 అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు.
అత్యవసర గమ్యాలను చేరుకోవడానికి 5 నిమిషాలు..సామాజిక అవసరాలకు 10... కార్యక్షేత్రానికి చేరుకోవడానికి 15 నిమిషాలు అనే కాన్సెప్ట్ అమలు చేస్తామని సిఎం చంద్రబాబు ఈ సమావేశంలో వివరించారు.