ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి మురిసిన చంద్రబాబు
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం ఢిల్లీ మెట్రో రైలుని పరిశీలించారు. తర్వాత శివాజీ స్టేడియం నుంచి ఢిల్లీ విమానాశ్రయం వరకు మెట్రో రైలులో చంద్రబాబు ప్రయాణించారు. చంద్రబాబు వెంట సుజనా చౌదరితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మెట్రో ప్రయాణం సౌకర్యంగా ఉందని అన్నారు. తాను ఎప్పటి నుంచో ఢిల్లీ మెట్రోను చూడాలనుకున్నట్లు చెప్పారు. మరోసారి సగం రోజు ఖాళీ చూసుకోని మెట్రోను పూర్తిగా పరిశీలిస్తానని చెప్పారు. మెట్రోతో సమయం ఆదా, పొల్యూషన్ ఉండదన్నారు.
దేశంలో అధిక జనాభా ఎక్కువగా ఉండటంతో మరిన్ని మెట్రోలు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. విశాఖ, విజయవాడల్లో అత్యున్నత ప్రమాణాలతో మెట్రో ప్రాజెక్టును తీసుకువస్తామన్నారు. అందుకోసం ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలలో మెట్రోలను పరిశీలిస్తామని చంద్రబాబు వెల్లడించారు.
ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ శర్మతో చంద్రబాబు ముచ్చటించారు. విశాఖ మెట్రో రైల్ నివేదిక ఇవ్వడంలో ఆలస్యానికి కారణాలు చెప్పారు. విజయవాడలో పూర్తిగా పిల్లర్లపైనే మెట్రోను నిర్మిస్తామని చెప్పారు. మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5 నుంచి 7 వేల కోట్లు వ్యయం అవుతుందని వెల్లడించారు.
ఇక ఢిల్లీ విమానాశ్రయం నుంచి చంద్రబాబు నేరుగా తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతిలో సాయంత్రం మూడు విద్యాసంస్ధలకు ఒకేసారి ఆయన శంకుస్ధాపన చేయనున్నారు.