టిడిపి ఎంపీలతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్:అవిశ్వాస తీర్మానంపై దిశానిర్దేశం
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, అవిశ్వాస తీర్మానంపై దిశానిర్దేశం చేశారు.
సిఎం చంద్రబాబుతో టెలీకాన్ఫరెన్స్ అనంతరం టిడిపి ఎంపీలు పార్టీ పార్లమెంటరీ నేత సుజనాచౌదరి నివాసంలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు లోపల, బయట అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ఎంపీలు తోటనర్సింహం, కేశినేని నాని అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ తీర్మానంపై ఈరోజు పార్లమెంటులో చర్చ జరుగుతుందా లేదా అనే విషయం సందిగ్దత నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు 150 మంది ఎంపీలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని పార్టీల నేతలతో టీడీపీ ఎంపీలు బృందాలు బృందాలుగా ఏర్పడి భేటీ అయిన విషయం తెలిసిందే.
అవిశ్వాస తీర్మానం విషయమై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మద్దతును టిడిపి ఎంపీలు కోరగా ఆయన దీనిపై సానుకూలంగా స్పందించారట. చంద్రబాబు కు తమ పూర్తి మద్దతు ఉంటుందని లాలూ హామీ ఇచ్చారని టిడిపి ఎంపీలు చెబుతున్నట్లు తెలిసింది. మరోవైపు టిడిపి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టిడిపి అవిశ్వాస తీర్మానం ఢిల్లీ స్థాయిలో హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది.