భార్యకు చంద్రబాబు థ్యాంక్స్, బోయపాటిని మార్పులు కోరారు
రాజమహేంద్రవరం: గోదావరి పురష్కరాల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరికి కృతజ్ఞతలు చెప్పారు. ఆయన శనివారం నాడు మాట్లాడుతూ... తన భార్యకు కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నారు.
గంగానది హారతి చూసి ఆ స్థాయిలో గోదావరి హారతి ఉండాలని సలహా ఇచ్చారని, ఈ జీవనదికి ఇచ్చే హారతిలో సరైన మార్పులు చేయాలని దర్శకుడు బోయపాటి శ్రీనుని కోరానని చెప్పారు. ఆయన షూటింగ్ బిజీలో ఉన్నా ఇక్కడకు వచ్చి అందర్నీ ఆకట్టుకొనేలా చేశారన్నారు.
బాబా రాందేవ్ తిరుపతిలో యోగా, ఆయుర్వేద, ఆధ్మాతిక కేంద్రం స్థాపించేందుకు హామీ ఇచ్చారని, కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మఠంవారు ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారని చంద్రబాబు చెప్పారు.
బోయపాటి డైరెక్షన్లో బాణసంచా
రాజమహేంద్రవరం శనివారం సాయంత్రం వెలుగులమయమైంది. గోదావరి పాత వంతెన బాణసంచా వెలుగుజిలుగులు సంతరించుకుంది. బాణసంచా కాల్పులు దీపావళిని తలపించాయి. ఈ బాణసంచా వెలుగును బోయపాటి శ్రీను డైరెక్షన్లో నిర్వహించారు.