అనంతపురంలో సిఎం చంద్రబాబు...దత్తత గ్రామం కొమరవోలులో నారా భువనేశ్వరి పర్యటన
అమరావతి:ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు గాను బుధవారం ఉదయం గన్నవరం నుంచి అనంతపురం జిల్లాకు బయలుదేరి వెళ్లారు.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. గుమ్మగట్టు మండలం భైరవానితిప్పలో లక్షన్నొక్క పంట కుంటలను ఆయన ప్రారంభించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తాము దత్తత తీసుకున్న గ్రామం కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలులో పర్యటిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగుతుందని తెలిసింది. భైరవానితిప్పలో లక్షా ఒక్క ఫాంపౌండ్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో అందుకు గుర్తుగా సిఎం చంద్రబాబు పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అనంతరం బీపీటీ ప్రాజెక్టును సందర్శిస్తారు.
ఆ తర్వాత రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి అవుతారు. మధ్యాహ్న భోజననానంతరం కుందిర్పి బ్రాంచ్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తమ దత్తత గ్రామం కృష్ణా జిల్లా కొమరవోలులో పర్యటిస్తున్నారు. ముందుగా దేవాదాయ శాఖ, గ్రామస్థుల సహకారంతో పునర్నిర్మించిన శివాలయ కలశాన్ని ఆమె ప్రతిష్టించారు. అనంతరం పంచాయితీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆపై అంగన్ వాడీ భవన ప్రారంభోత్సవంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే కొమరవోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భువనేశ్వరి పాల్గొన్నారు.