టిడిపి రెండోసారి అఖిలపక్ష ప్రయోగం...అవకాశమా?..ఆశాభంగమా?
అమరావతి:ఎపి సిఎం,టిడిపి అధినేత చంద్రబాబు ఎపికి ప్రత్యేక హోదా సాధన విషయమై చర్చించేందుకు పట్టుదలతో నిర్వహిస్తున్నరెండవ అఖిలపక్ష సమావేశం శనివారం సచివాలయంలో జరుగనుంది. మధ్యాహ్నం 2గంటలకు ఈ అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానున్నట్లు తెలిసింది. మొదటి అఖిలపక్ష సమావేశం సందర్భంగా పలు విమర్శలు ఎదుర్కొన్న టిడిపి ప్రభుత్వం ఈ రెండో సమావేశానికి అన్ని పార్టీలకు ముందుగానే, సముచిత రీతిలో ఆహ్వానం పంపింది.
అయినప్పటికీ ఈ సమావేశానికి హాజరుకాబోతమని లెఫ్ట్, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసేశాయి. దీంతో ఈ సమావేశానికి హాజరయ్యే ఉద్యోగ,ప్రజా,పాత్రికేయ,విద్యార్థి సంఘాలతోనే అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ అఖిల పక్షానికి ప్రధాన రాజకీయ పార్టీల గైర్హాజరు టిడిపికి రాజకీయంగా లాభమా?...నష్టమా అనే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవేంటంటే?
మొదటి అఖిలపక్షం...విమర్శలు
ఎపికి విభజన హామీల సాధన విషయమై చర్చించేందుకంటూ టిడిపి నేతృత్వంలో జరిగిన మొదటి అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు హాజరుకాకపోవడంతో పాటు హడావుడిగా మొక్కుబడిగా ఆహ్వానించడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి మరోసారి పట్టుదలగా రెండోసారి అఖిలపక్షం నిర్వహిస్తూ ఈ సమావేశానికి ఆహ్వానం విషయమై విమర్శలు తలెత్తే అవకాశం లేకుండా మంత్రులతోనే ఆహ్వానాలు పలికించింది. ఇందువల్ల ఏ పార్టీ అయినా తాము అఖిలపక్షానికి గైర్హాజరు కావడానికి తమ పార్టీ నిర్ణయమే తప్ప టిడిపి ఆహ్వానించే విషయమై విమర్శ చేసే అవకాశం లేకుండా టిడిపి ఈ జాగ్రత్త తీసుకుంది.
అయిననూ...విపక్షాల నుంచి తిరస్కరణే
అయినప్పటికీ శనివారం ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి హాజరయ్యేది లేదని వైసీపీ,జనసేన,బీజేపీ,కాంగ్రెస్,లెఫ్ట్ పార్టీలు తెగేసి చెప్పేశాయి. నాలుగేళ్లు కేంద్రంతో అంటకాగి తీరా ఎన్నికలొస్తున్న సమయంలో ప్రత్యేకహోదా ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తున్నట్లు చంద్రబాబు వ్యూహం పన్నుతున్నారనేది విపక్షాల ఆరోపణ. అంతేకాదు నాలుగేళ్ల టిడిపి పాలనలో రాష్ట్రానికి సంబంధించి ఎంత ముఖ్యమైన నిర్ణయాన్నైనా ఏకపక్షంగా తీసుకోవడం, అఖిలపక్షాలతో కనీసం నామమాత్రంగానైనా కలుపుకుపోయే ప్రయత్నం చేయకపోవడం పై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. టిడిపి అవకాశవాదానికి తగిన బుద్ది చెప్పే అవకాశం తమకు లభించినట్లు కొందరు విపక్షాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
అయితే రెండో ప్రయత్నంలోనూ...ఆశాభంగమేనా?
రాష్ట్రంలోని పార్టీలన్నింటికీ నేతృత్వం వహించే స్థాయి తమ పార్టీకే ఉన్నదని అందరికీ, ముఖ్యంగా కేంద్రానికి చాటిచెప్పాలన్నది చంద్రబాబు ప్లాన్ గా ప్రతిపక్షాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఏమాత్రం చిత్తశుద్ది లేకుండా కేవలం అవకాశ వాదంతో చేసే ఇలాంటి ప్రయత్నాల్లో తామెలా పావులుగా మారతామని ప్రధాన ప్రతిపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అందుకే వారం క్రిందట చంద్రబాబు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కొన్ని విపక్షాలు గైర్హాజరు కాగా ఈసారి గతంలో హాజరైన మరో రెండు పార్టీలు కూడా ఈ సారి హాజరుకావడం లేదని ప్రకటించేశాయి. దీంతో పట్టుదలతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ ప్రయత్నం చేస్తే గతంలో వచ్చిన పార్టీలు కూడా ఈసారి అఖిలపక్షానికి రాకపోవడం చంద్రబాబుకు ఆశాభంగం కలిగించే అంశమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు తాను రాజకీయంగా ఒంటరైన పరిస్థితి స్ఫష్టంగా కనిపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.
అయినప్పటికీ...టిడిపికి ఒక అవకాశమే
అయితే ఎపికి ప్రత్యేక హోదా విషయమై రాజకీయాలకు అతీతంగా తాము అన్ని పార్టీలను కలుపుకొని పోయే ప్రయత్నాలు చేస్తుంటే ఏ కారణం చేతనైనా ప్రతిపక్షాలు రాకుండా ఎగ్గొట్టడమనేది ఆ రాజకీయ పార్టీల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని టిడిపి ఈ సందర్భంగా విమర్శించడానికి అవకాశం ఉంది. గతంలో జరిగిన లేదా తమకు చిత్త శుద్ది లేరనే ఆరోపణలతో అసలు అఖిలపక్షానికే హాజరుకాకపోవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం...లేదా ప్రజా శ్రేయస్సు కంటే ప్రతీకారం తీర్చుకోవడానికే తమ ప్రాధాన్యమని ప్రతిపక్షాలు రుజువు చేసుకున్నట్లు అవుతుందని, అదే విషయాన్ని ప్రజల్లో బలంగా ప్రచారం చేయడానికి టిడిపికి ఇది ఒక చక్కటి అవకాశంగా భావించవచ్చు.