సీఎం గారూ .. ముందు ఈ సమస్య పరిష్కరించండి అన్న కేశినేని నానీ
సొంత పార్టీ నేతలు, ప్రత్యర్థి పార్టీ నేతలపై మాటల దాడులే కాదు , ప్రజా సమస్యలను సైతం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని . మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆయన సీఎం జగన్ కు ఒక పోస్ట్ పెట్టారు. . గత కొంతకాలంగా కేశినేని తాను చెప్పాలనుకునే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్న విషయం తెలిసిందే . .
ఇటీవల సీఎం జగన్ మీద సెటైర్లు వేశారు కేశినేని నానీ ''కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి బడ్జెట్లో రూ.21 కోట్లు సాధించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి గారూ.. మీరు, మీ 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్ సార్'' అని కేశినేని నాని ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు మాత్రం ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకువస్తున్నామని ఓ సమస్య పరిష్కరించాలని నానీ కోరారు.ఈ సారి ముఖ్యమంత్రి జగన్కు ఓ సమస్య వివరిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. విజయవాడలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందని కేశినేని నాని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
విజయవాడ రోడ్ల దుస్థితిపై కేశినేని నానీ స్పందించారు. విజయవాడ వాసులు ఈ రోడ్ల కారణంగా నానా అవస్థలు పడుతున్నారని కేశినేని నాని పేర్కొన్నారు. వెంటనే రోడ్ల మరమ్మత్తు చేయాలని కేశినేని ఫేస్ బుక్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓ వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని తన పోస్టుకి ట్యాగ్ చేసిన నానీ తన విన్నపాన్ని ప్రభుత్వానికి వివరించారు.ఏపీలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కేశినేని నానీ తన అభిప్రాయాలన్నింటినీ సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తుండటం విశేషం. ప్రతి పోస్ట్ లోనూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తున్న నానీ తాజాగా ప్రజా సమస్య అయిన రోడ్ల సమస్య పరిష్కారం కోసం పెట్టిన పోస్ట్ లో మాత్రం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యలేదు.