విశాఖకు తరలింపు ముహూర్తం ఫిక్స్! సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే!
సచివాలయం విశాఖకు తరలింపు ఖాయమైది. కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర లాంఛనంగా మారింది. ఇక, విశాఖ నుండి పాలన సాగించేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్దం చేసినట్లు విశ్వస నీయ సమాచారం. అందులో భాగంగా కీలక నేతలు..ముఖ్య అధికారులతో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర పడిన తరువాత..విశాఖలో పనులు వేగవంతం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు.
ఈ నెల 30న సచివాలయ..హెచ్ఓడీల్లో పని చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు సమావేశం కానున్నారు. తరలింపుకు సహకరించాల్సిందిగా కోరుతారు. వారు నేరుగా సీఎంతో కలిసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో..అమరావతి పైన ఏం చేయాలనే దాని పైన కసరత్తు సాగుతోంది. ముఖ్యమంత్రి కొందరు ముఖ్య అధికారులతో విశాఖ నుండి పాలన ఎప్పటి నుండి మొదలవుతుందనే దాని పైన స్పష్టత..ముహూర్తం సైతం ఖరారు చేసినట్లు సమాచారం.
ఆమోద ముద్ర లాంఛనమే...
ఈ రోజు జరగే కేబినెట్ సమావేశంలో విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు నిర్ణయం కేవలం లాంఛనం కానుందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే విశాఖ నుండి పాలన సాగించే విధంగా పూర్తి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ముందుగా సచివాలయం తరలింపు పైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
విశాఖలో కీలకమైన ప్రాంతంలో సచివాలయం ఏర్పాటుకు అసవరమైన భవనం సైతం ఇప్పటికే గుర్తించినట్లుగా సమాచారం. అయితే, కేబినెట్ సమావేశం తరువాత నిర్ణయం అమలు దిశగా వేగంగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం సైతం ఇదే విషయాన్ని కొందరు పార్టీ ముఖ్య నేతలతో పాటుగా కీలకమైన అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. నిర్ణయం అమల్లో ఆలస్యం జరిగితే ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని..అటువంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా వెంటనే అడుగులు పడాలని సీఎం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సీఎం లక్ష్యం..ఉగాది నాటికే తరలింపు
ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుండి పాలన రానున్న ఉగాది నుండి ప్రారంభించాలని భావిస్తున్నారు. అందు కోసం అధికారులకు సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేబినెట్ నిర్ణయం జరిగిన వెంటనే సీఎం విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడి ఏర్పాట్ల పైన సమీక్ష చేస్తారు. అదే సమయంలో అక్కడ ఏర్పాట్లను సైతం ఉగాదిలోగా పూర్తి చేయాలని సీఎం సూచించే అవకాశం కనిపిస్తోంది.
ఉగాది నాడు సీఎం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి కేటాయింపుల పధకం ప్రారంభించాలని నిర్ణయించారు. అదే రోజు విశాఖలో పాలనా వ్యవహారాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. సచివాలయం తరలింపు పెద్దగా సమస్య కాబోదని..అయితే, హెచ్ఓడీల విషయంలో మాత్ర కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల ముఖ్య కార్యదర్శుల తో సీఎం జగన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగులతో నేరుగా సంప్రదింపులు
అమరావతి ప్రాంతంలోని సచివాలయం..హెచ్ఓడీల్లో పని చేస్తున్న ఉద్యోగులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ ఖరారయ్యే అవకాశం ఉందని సచివాలయ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ముందుగా ఉద్యోగులను విశాఖకు తరలించే నిర్ణయం వెనుక కారణాలను వివరిస్తూ..ఉద్యోగుల సహకారం కోరనున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.
ఇక..ఉద్యగుల్లో నెలకొన్న సందేహాలను తొలిగించేందుకు వారితో చర్చల కోసం మంత్రులు..అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి..ఉద్యోగుల సమస్యల పరిష్కా రానికి నిర్ణయాలు తీసుకొనే విధంగా అడుగులు పడనున్నాయి. అటు రైతుల విషయం పైన నిర్ణయం తీసుకున్న వెంటనే..ఇక ఉగాది నాటికి విశాఖకు తరలించేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది.