నేడే..సీఎం జగన్ ప్రత్యేక విందు: వైసీపీ ఎమ్మెల్యేలు..అధికారులతో కలిసి: అసలు లక్ష్యం అదేనా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ భారీ విందు ఏర్పాటు చేసారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా విందు అని చెబుతున్నా..పక్కా అజెండాతో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ల సమావేశం సమయంలో మాత్రమే సీఎం మంత్రులు..అధికారులకు విందు ఏర్పాటు చేయటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఇప్పుడు మంత్రులే కాదు..ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలను సీఎం అహ్వానించారు. ఇదే విందుకు జిల్లా కలెక్టర్లు..ఎస్పీలు..పోలీసు..రెవిన్యూ ఉన్నతాధికారులకు ఆహ్వానాలు అందాయి. మొత్తం 13 జిల్లాలకు చెందిన వారిని..13 టీంలుగా విందు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో టేబుల్ వద్ద సీఎం అక్కడి అంశాల ఆధారంగా సమయం కేటాయిస్తారు. అయితే, ఇలా అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను..అధికారులను ఒకే చోటకు తీసుకురావటం.. వారితో సీఎం విందు సమావేశం ఏర్పాటు చేయటం ద్వారా..ముఖ్యమంత్రి జగన్ ప్రధాన లక్ష్యంతో ముందకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది.
అవి తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా ? సీఎం జగన్ సవాల్
సీఎం విందు..సెలవులో ఉన్న అధికారులు సైతం..
ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు రాత్రికి ప్రత్యేక విందు ఏర్పాటు చేసారు. దీనికి రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు..అధికారులను ఆహ్వానించారు. సెలవులో ఉన్న కలెక్టర్లు..ఎస్పీలు రావాలని సూచించారు. సాయంత్రం 6.30కి ఈ విందు ప్రారంభం కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..డీజీపీతో సహా.. అన్ని జిల్లాల అధికారులు హాజరవుతున్నారు. అయితే, ఇలా 13 జిల్లాలకు చెందిన అధికార పార్టీ నేతలతో కలిసి.. వారితో అధికారులను సైతం కలిపి ముఖ్యమంత్రి విందు ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి తన లక్ష్యాలు చెప్పటంతో పాటుగా.. అధికార పార్టీ నేతలు..అధికారుల మధ్య సమన్వయం కోసమే ఈ విందు ఏర్పాటు చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన, వివిధ జిల్లాల సమస్యలు, గ్రామ సచివాలయాలు, స్పందన, మహిళల భద్రత తదితర అంశాల మీద విందు భేటీలో చర్చిస్తారని నిర్వహకులు చెబుతున్నారు.
జిల్లాల వారీగా ఏర్పాట్లు.. 13 టేబుల్స్ వద్ద..వారంతా
ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్న విందులో 13 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ టేబుళ్ల వద్ద జిల్లా కలెక్టర్..ఎస్పీతో పాటుగా జిల్లా మంత్రులు..ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా సీటింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతీ టేబుల్ వద్ద ముఖ్యమంత్రి పది నిమిషాల సమయం గడపనున్నారు. ఆ సమయంలో ప్రధానంగా జిల్లాలో తాను గుర్తించిన సమస్యలతో పాటుగా...తన వద్దకు వచ్చిన అంశాల పైన జగన్ నేరుగా వారితో చర్చించనున్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు..అధికారుల మధ్య సమన్వయ లోపం గురించి సీఎం వివరించి..వారికి దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. జిల్లాల వారీగా తన వద్దకు వచ్చిన సమస్యలు..ప్రధాన అంశాలను వారి ముందు పెట్టి..అదే సమయంలో క్షేత్ర స్థాయిలో వారి సమస్యల గురించి సీఎం తెలుసుకోనున్నారు. అదే సమయంలో అధికారిక విధుల్లో ప్రజా ప్రతినిధుల జోక్యం వద్దని..ఎమ్మెల్యేలు ప్రస్తావించే సమస్యలకు అధికారులు పరిష్కార దిశగా ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు..అధికారుల సమక్షంలోనే సీఎం తేల్చి చెబుతారని సమాచారం.
ముఖ్యమంత్రి అసలు లక్ష్యం ఇదేనా..
ఇలా..ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యేతో కలిపి తన సమక్షంలో ముఖ్యమంత్రి అధికారులకు సైతం విందు ఇవ్వటం ద్వారా సీఎం తన లక్ష్యం ఏంటో చెప్పకనే చెబుతున్నారు. మంత్రులే కాదు.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత పెంచేలా అధికారులకు దిశా నిర్దేశం చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా 13 జిల్లాలకు సంబంధించిన రాజకీయ..అధికారిక..ప్రభుత్వ పధకాల అమలు పైన ముఖ్యమంత్రి వద్ద పూర్తి సమాచారం ఉంది. వీటి పైన జగన్ ప్రస్తావిస్తారని సమాచారం. అదే సమయంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు..రచ్చబండ గురించి వారిని సమాయత్తం చేయనున్నారు. ఇక, సంక్రాంతి నుండి సీఎం జగన్ రచ్చబండ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక..ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పధకాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించే విషయంలో కొత్త బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే, ఇది మాత్రం రాజకీయంగా ఎమ్మెల్యేలకు ఈ విందు కీలకంగా మారుతోంది. ఇక ఈ విందులో సంప్రదాయ ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌతిండియన్ వంటలను వండి వడ్డిస్తారని నిర్వహకులు చెబుతున్నారు. అధికారులను..ప్రజా ప్రతినిధులను ఒకే చోటకు తీసుకొచ్చి..వారికి విందు ఇచ్చి మరీ..వారికి దిశా నిర్దేశం చేయటం ద్వారా సీఎం జగన్ కొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు.