దాడులకు సీఎం బాధ్యుడు... వ్యవస్థలు నిర్వీర్యమవుతుంటే గవర్నర్ స్పందించలేరా : యనమల
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో గవర్నర్ స్పందించాలని అన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, ఆకృత్యాలపై గవర్నర్ జోక్యం చేసుకోకపోవడం చూస్తుంటే, వైసీపీ అరాచకపాలనకు ఆయన కొమ్ము కాస్తున్నట్లుగా ఉందని విమర్శలు గుప్పించారు . రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతుంటే, రాజ్యాంగబద్ధుడైన వ్యక్తి కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేయక పోవడం ఏంటని ప్రశ్నించారు.
లోకల్ వార్ ...బెదిరింపులు,దాడులపై టీడీపీ ఫైర్ ..రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈసీకి బాబు లేఖ
పోలీసులు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు
మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన పోలీసులు ప్రభుత్వానికి ఊడిగం చేస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు, అప్రజాస్వామిక చర్యలన్నింటికీ ముఖ్యమంత్రే బాధ్యులని మండిపడ్డారు. స్థానికపోరులో వైసీపీవారు గెలవకపోతే మంత్రులంతా నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి, రాజీనామాలు చెయ్యాలని చెప్పటం, ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వనని చెప్పటం , మీరు చచ్చినా పర్లేదుగానీ, ఎన్నికల్లో గెలిచితీరాలని చెప్పి వారిపై ఒత్తిడి తీసుకురావటం తోనే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వ పాలన సరిగాలేనప్పుడు గవర్నర్ జోక్యం తప్పనిసరి
స్వతహాగా ఫ్యాక్షనిస్ట్ అయిన వ్యక్తి ఫాసిస్టుగా మారి, రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే, రాష్ట్రం ఎలా బాగుపడుతుందో ప్రజలంతా ఆలోచించాలని యనమల పేర్కొన్నారు . ఎన్నికల వేళ ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి టీడీపీ పోరాటం చేస్తోందన్నారు. దానికి ప్రజల మద్దతు కావాలన్నారు. ఇంత దారుణాలు జరుగుతుంటే గవర్నర్ స్పందించాలని చెప్పారు.ప్రభుత్వ పాలన సరిగాలేనప్పుడు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర పాలనా వ్యవస్థలకు అధిపతిగా ఉన్న గవర్నర్ ఎందుకు స్పందించడం లేదని యనమల రామకృష్ణుడు నిలదీశారు. జరుగుతున్న దారుణాలన్నింటికీ చాలా స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ, గవర్నర్ మౌనంగా ఉండటం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు.
కేంద్రానికి గవర్నర్ నివేదిక ఇవ్వాలన్న యనమల
రాష్ట్రంలో ఏం జరిగినా కూడా రాజ్యాంగం ప్రకారం గవర్నర్, కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్నారు . పోలీసులకు, డీజీపీకి ఎన్ని పిటిషన్లు ఇచ్చినా పోలీస్ వ్యవస్థ స్పందించకపోగా, ఫిర్యాదులు చేసిన వారిపైనే తిరిగి కేసులు పెడుతూ, వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని యనమల తెలిపారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు మాట్లాడే స్థితి, చర్యలు తీసుకునే పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే, అవిపూర్తిగా ఏకపక్షంగా ప్రభుత్వ ఆదేశాలప్రకారమే జరుగుతున్నాయన్నారు.
పార్టీలు మారేవారు వారి స్వార్థంకోసం వెళ్తున్నారు
పోలీస్ వ్యవస్థ అలా తయారవడంతో కోర్టులను ఆశ్రయించామని చెప్పిన ఆయన ఇప్పటికైనా గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కోరారు. పార్టీలు మారేవారు వారి స్వార్థంకోసం వెళుతున్నారు తప్ప, వారి ప్రభావం పార్టీలపై ఉండదని, ఎవరుపోయినా, ఉన్నా దాని ప్రభావం టీడీపీపై ఉండబోదని యనమల అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపోటములతో పనిలేదని, స్థానిక ఎన్నికల్లో చావోరేవో తేల్చుకుంటామని , అలాగే రాజ్యసభ ఎన్నికల్లోనూ బలం లేకున్నా బరిలోకి దిగామని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.