వరద పరిస్థితులపై సీఎం జగన్ ఏరియల్ సర్వే: బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని సమీక్షలో సూచన
భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలైన ఉభయగోదావరి జిల్లాలు వరద ప్రభావంతో అతలాకుతలం అవుతున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మండలాలు వరద ముంపుకు గురయ్యాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజా వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటుగా ఏరియల్ సర్వే నిర్వహించి వరద ప్రభావాన్ని అంచనా వేశారు.
వరదకు గురైన గోదావరి జిల్లాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్
ఉభయగోదావరి జిల్లాల్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వరద వల్ల కలిగిన నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా చూశారు. సీఎం జగన్ వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్ని నాని ఉన్నారు. ఏరియల్ సర్వే నిర్వహించడానికి ముందే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వరద సహాయక చర్యలపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి నేను ఏరియల్ సర్వేకి వెళుతున్నాను, మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలేసి రావాల్సిన అవసరం లేదు అంటూ పేర్కొన్నారు.
బాధితుల పట్ల ఉదారంగా ఉండండి .. అధికారులకు జగన్ సూచన
వరద బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, ఇది మన ఇంట్లో సమస్య అన్నట్టుగానే భావించాలని సీఎం జగన్ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. వరద బాధిత కుటుంబాలకు రెండు వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లుగా జగన్ తెలిపారు. సమీక్ష సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న ఉద్దేశం, ఎక్కడివారక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెసులుబాటు కల్పించడం అని ఆయన పేర్కొన్నారు.
Recommended Video
పంట నష్టం అంచనా వెయ్యండి .. ప్రజలకు బాసటగా ఉండండి :సమీక్షలో సీఎం జగన్
వరద తగ్గుముఖం పట్టిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి పంట నష్టం అంచనాలను వేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు జగన్. మరో మూడు రోజుల తర్వాత గోదావరి శాంతించే అవకాశముందని అప్పటివరకు నిరాశ్రయులైన ప్రజలకు బాసటగా నిలవాలని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ముంపు గ్రామాలలో సమస్యలు పరిష్కరించాలని, విద్యుత్ సమాచార సేవలు పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అవసరాల మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు .