కొత్త జెడ్పీ ఛైర్మన్లు వీరే- సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ : ఫలితాల పై ధీమా-ఆ లెక్కలు పక్కాగా..!!
ఏపీలో కొత్తగా జిల్లా పరిషత్ లు కొలువు తీరనున్నాయి. ఎన్నికలు జరిగినా..ఫలితాలు వెల్లడి కాకపోవటంతో కోర్టు తీర్పు కోసం నిరీక్షించారు. గెలుస్తామని ధీమా ఉన్నా.. కౌంటింగ్ కోసం ఎదురు చూడక తప్పలేదు. ఇక, ఇప్పుడు కోర్టు కౌంటింగ్ ప్రక్రియకు అనుమతి ఇవ్వటంతో వారంతా ఇక పదవులు దక్కించుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, అన్నింటా సామాజిక సమీకరణాలు పక్కాగా అమలు చేస్తున్న సీఎం జగన్ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎంపికకు ఆమోదం తెలిపినట్లుగా విశ్వసనీయ సమాచారం.
వైసీపీ ధీమా..అన్ని జిల్లాలు వారి ఖాతాలోకే
మున్సిపాల్టీలకు ఛైర్మన్లు..కార్పోరేషన్లకు మేయర్ల ఎంపిక సమయంలో అమలు చేసిన సోషల్ ఇంజనీరిం గ్ ను ఇక్కడా అమలు చేస్తున్నారు. ఆదివారం జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో..ఫలితాలు వెల్లడి కాక ముందే..వైసీపీ అన్ని జిల్లా పరిషత్ లు ఖచ్చితంగా తామే గెలచుకుంటామనే ధీమాతో ఉంది. అందులో భాగంగా.. ఫలితాలు వచ్చిన తరువాత పార్టీలో పదవుల కోసం కీచులాటలకు అవకాశం లేకుండా..ముందుగానే జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎంపికను దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
జిల్లాలు - కొత్త ఛైర్మన్లు వీరే
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా మజ్జి శ్రీనివాసరావుకు అవకాశం దక్కనుంది. విశాఖపట్నంకు శివరత్నం పేరు ఖరారు చేసారు. గుంటూరు జిల్లాకు క్రిస్టినా పేరు ఫైనల్ అయింది. ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా బూచేపల్లి వెంకాయమ్మ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా కవురు శ్రీనివాస్ ను ఎంపిక చేసారు. క్రిష్ణా జిల్లా కు ఉప్పాళ్ల హారిక పేరు డిసైడ్ చేసారు. కడపకు తొలి నుంచి అంచనా వేస్తున్నట్లుగా ఆకేపాటి అమర్నాధరెడ్డి పేరు ఫైనల్ అయింది.
సామాజిక లెక్కలు పక్కగా అమలు
ఇక, నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఆనం అరుణమ్మను ఖరారు చేసారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో వి. కోట నుంచి పోటీ చేసిన శ్రీనివాసులుతో పాటుగాా మంత్రి పెద్దిరెడ్డి బంధువు ఒకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసులుకే ఈ పీఠం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక.. తూర్పు గోదావరి జిల్లా నుంచి విప్పర్తి వేణు గోపాల్ పేరు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. అనంతపురం జిల్లా నుంచి ఆత్మకూరు జెడ్పీటీసీగా పోటీ చేసిన గిరిజ తొలి రేసులో ఉన్నారు.
పోటీ ఉన్న వాటి పైన రేపు నిర్ణయం
అదే విధంగా కదిరి నుంచి పోటీ చేసిన జక్కల ఆదిశేషు భార్య , గుత్తి నుంచి పోటీలో ఉన్న ప్రవీణ్ యాదవ్ సతీమణి సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో గతంలోనే జెడ్పీ ఛైర్మన్ పదవిని ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఆయన మరణించటంతో ఆయన కుమారుడికి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ మహిళకు కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న మహిళకు తాజాగా నామినేటెడ్ పదవుల్లో భాగంగా పోస్టు కేటాయించారు. దీంతో..ఆ తరువాత రేసులో ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరిని ఈ రోజు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
సమన్వయకర్తలకు సీఎం నిర్దేశం
ఇక, ముఖ్యమంత్రి జగన్ తొలి నుంచి అమలు చేస్తున్న విధంగా ఎంపీపీ పదవులను ఖరారు చేయాలని పార్టీ నేతలకు స్పష్టం చేసారు. అదే విధంగా మహిళలకు సైతం ఖచ్చితంగా శాతం పదవులు దక్కాలని నిర్దేశించారు. ఒక మండలంలో జెడ్పీటీసీ..ఎంపీపీ పదవుల్లో రెండూ ఓసీలకే దక్కే పరిస్థితి ఉంటే..వాటిలో ఒకటి ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ..మైనార్టీలకు కేటాయించాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. ఈ లెక్కల ఆధారంగా ఎంపీపీ పదవుల పైన మాత్రం ఫలితాల వెల్లడి తరువాత క్లారిటీ రానుంది.
Recommended Video
2014 ఫలితాలకు భిన్నంగా ..పూర్తిగా
ఇక, 2014 లో జరిగిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల తరువాత కర్నూలు, నెల్లూరు, కడప జిల్లా పరిషత్ లు వైసీపీ దక్కించుకుంది. కానీ, ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో టీటీపీ ఖాతాలోకి మారిపోయాయి. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా అన్ని జిల్లాల్లోనూ వైసీపీ జెడ్పీ పీఠాలు గెలుచుకుంటుందని వైసీపీ ధీమాగా చెబుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని కార్పోరేషన్లు-మున్సిపాల్టీల్లో కేవలం తాడిపత్రి మాత్రమే టీడీపీ ఖాతాలో పడింది. మిగిలిన అన్నీ ఏకపక్షంగా వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు జెడ్పీటీసీ స్థానాల విషయంలోనూ అదే జరుగుతుందని వైసీపీ ధీమాగా ఉంది.
ఎంపీపీ పదవుల పైనా స్పష్టత
దీని ద్వారా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్త జెడ్పీ ఛైర్మన్ లిస్టుకు ఆమోద ముద్ర వేయటంతో ఫలితాల్లో అంచనాలకు మించి ఏమైనా అనూహ్యంగా ఉంటే మినహా.. వీరే కొత్త జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా అధికారికంగా ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఆదివారం జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పైనే ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతోంది. అయితే, కొన్ని జిల్లాలోని సీనియర్ మంత్రులు చివరి నిమిషంలో సీఎం వద్ద ఎంపీపీల విషయం లో ఒత్తిడి చేసే అవకాశాలు ఉన్నాయి.
అన్ని జిల్లాల్లోనూ ఒకటే పాలసీ... ఎవరైనా ఫాలో కావాల్సిందే
దీంతో..పార్టీ మొత్తం ఒకటే పాలసీ ప్రకారం ఎంపిక జరగాలని సీఎం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ల విషయంలో ముందుగానే రిజర్వేషన్లు ఖరారు కావటంతో..ఎంపీపీ విషయంలో మాత్రం పార్టీ తొలి నుంచి ఫాలో అవుతున్న ఫార్ములా అమలు కావాల్సిందేనని సీఎం స్పష్టం చేసినట్లుగా సమాచారం. దీంతో..పార్టీ జిల్లాల సమన్వయకర్తలు ఆదివారం ఫలితాలు వెల్లడి అయిన తరువాత దీని పైన జిల్లా మంత్రులు..ఎమ్మెల్యేలకు ఇదే అంశంలో వారి నుంచి ప్రతిపాదనలు తీసుకొని సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.