ఆ జిల్లాలో సీఎం జగన్ , మాజీ సీఎం చంద్రబాబుల పర్యటన .. బలాబలాలకు వేదిక
నెల్లూరు జిల్లాలో రాజకీయం హాట్ హాట్ గా మారుతుంది. అధికార ప్రతిపక్షాల బలాబలాలకు నెల్లూరు జిల్లా వేదిక కానుంది. మాజీ సీఎం చంద్రబాబు జిల్లా స్థాయి సమీక్షల కోసం నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. ఇక ఇదే సమయంలో ఒక రోజు గ్యాప్ తో తాజా సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం నెల్లూరుకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇద్దరు జిల్లాకు వస్తున్న నేపధ్యంలో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార , ప్రతిపక్ష పార్టీల నాయకులు బలాబలాలు చూపించుకోటానికి కసరత్తులు చేస్తున్నారు.
రైతు భరోసా లబ్దిదారుడిగా మంత్రి సురేష్: అర్హుల జాబితాలో పేరు: పలు జిల్లాల్లో ఇదే విధంగా..!
వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈనెల 15న సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు వస్తున్నారు. అదేవిధంగా సమీక్షల పేరుతో చంద్రబాబు కూడా అంతకుముందు రోజే జిల్లాకు చేరుకోనున్నారు. దీంతో ఇద్దరి భద్రత పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది అని చెప్పక తప్పదు . వీరి పర్యటనలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న వైసీపీ నేతలు సీఎం సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు లక్షమందికి పైగా సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా వైసీపీ బలం చూపించాలని భావిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించేందుకు వస్తున్న చంద్రబాబు సభలను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు సైతం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు పర్యటనను ఉపయోగించుకోవాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పర్యటనలతో జిల్లాలో రాజకీయ వేడి రగులుకుంది.