ఏపీలో కరోనా వైరస్ స్టేజ్-3 రావొద్దనే సీఎం జగన్ పోరాటం.. ఈటైమ్లో ఉచిత సలహాలు వద్దన్న విజయసాయి
దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు ఆదివారం సాయంత్రానికి 4వేలకు పెరిగాయి. వైరస్ విజృంభిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. అక్కడ సుమారు 700 కేసులు నమోదుకాగా, 36 మంది చనిపోయారు. అధికారికంగా బయటికి వెల్లడించనప్పటికీ మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి మూడో స్టేజ్.. అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దాకా వెళ్లిందని అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీలో కరోనా పరిస్థితులపై ఆదివారం వరుస ట్వీట్లలో కీలక విషయాల్ని ఆయన వెల్లడించారు.
మనకూ మూడో స్టేజ్ ముప్పు?
ఆదివారం నాటికి ఏపీలో కొత్తగా మరో 34 కేసులు రావడంతో కొవిడ్-19 పేషెంట్ల సంఖ్య 226కు పెరిగింది. ఒక మరణాన్ని ధృవీకరించారు. మర్కజ్ ప్రార్థనల వ్యవహారమే ఏపీలో కేసుల పెరుగదలకు కారణమని ఆరోగ్య శాఖ తెలిపింది. మర్కజ్ వెళ్లొచ్చినవారితో నేరుగా కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు వెంటనే పూర్తిచేయాలని సీఎం జనగ్ ఆదేశించారు కూడా. ఏపీలో మూడో స్టేజ్ రావొద్దన్నదనే జగన్ తోపాటు ప్రభుత్వ యంత్రాంగమంతా శ్రమిస్తున్నదని ఎంపీ తెలిపారు.
మహారాష్ట్రలో అలా..
మహారాష్ట్రలో బయటపడుతున్న కొవిడ్-19 కేసులు ఆందోళన కలిగిస్తున్నవని, విదేశాల నుంచి వచ్చినవారితో కాంటాక్ట్ లేకుండానే కొందరికి వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు గుర్తించారని, దీంతో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై భయాందోళనలు చెలరేగాయని ఎంపీ విజయసాయి తెలిపారు. ప్రస్తుతానికి ఏపీలో ఆ పరిస్థితి లేకున్నా.. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వైసీపీ ఎంపీ తెలిపారు.
వివక్ష వద్దు..
కొన్ని చోట్ల వైరస్ బాధితుల పట్ల వివక్ష చూపుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. అలాంటివి తగదంటూ వైసీపీ ఎంపీ మరోసారి ప్రజలను రిక్వెస్ట్ చేశారు. ‘‘చైనా నుంచి ప్రపంచమంతా వ్యాపించింది. కరోనా వైరస్ కు కులాలు, మతాలు లేవు. ఎవరికైనా సోకవచ్చు. తమ ప్రాణం పోవాలని ఎవరూ అనుకోరు. కొద్దిమందిని అనుమానించి దోషులుగా చూడొద్దు. అందరం సంఘటితంగా నిలబడి ఎదుర్కోవాల్సిన సమయమిది. ఈ మహమ్మారిని తరిమేసే వరకు పోరాడాల్సిందే''అని ఆయన హితవుపలికారు. సామాజిక దూరం పాటిస్తూ, ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతేతప్ప కరోనాను నియంత్రించలేమన్నారు.
ఆ ఖర్చుతో ఆస్పలు వచ్చేవి..
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క ఆస్పత్రినీ కట్టించని చంద్రబాబు.. ఇప్పుడు కరోనా కట్టడి విషయంలోప్రతిరోజూ ఉచిత సలహాలు ఇస్తుండటం విడ్డూరంగా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మద్యం పంపిణీతోపాటు దీక్షల పేరుతో చంద్రబాబు కనీసం రూ.4వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశాడని, ఆ డబ్బును సక్రమంగా ఖర్చుపెట్టి ఉంటే, జిల్లాకో వెయ్యి పడకల ఆస్పత్రులు ఏర్పాటయి ఉండేవని అన్నారు.
దళారుల రాజ్యం పోయింది..
అన్నపూర్ణగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్ లో రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్నివిధాలుగా సాయపడుతుందని, ధాన్యం ప్రతి క్వింటాకు రూ.1835 రూపాలయ కనీస మద్దతు ధర ఇచ్చి, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఎంపీ తెలిపారు. ‘‘బాబు ఐదేళ్ల పాలనలో రైతులకు ఏనాడు గిట్టుబాటు ధర రాలేదు. దళారుల రాజ్యం నడిచింది. నూకల పేరుతో కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేసిన మాఫియా ఆటలు ఇకపై సాగవు. అర్థమవుతోందా బాబూ?''అని విజయసాయి రెడ్డి అన్నారు.