కేంద్రం చేతుల్లోకి జగన్, నిమ్మగడ్డ పోరు- అభిశంసన, ఉద్యోగుల కొరత- కీలకంగా డీవోపీటీ
ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభానికి ముందే ఉప్పూనిప్పూగా ఉన్న జగన్ సర్కార్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు ఎన్నికలు ప్రారంభమైన తర్వాత కూడా పలు విషయాల్లో విభేదిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాల్లో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతుండటంతో పరిష్కారం కోసం తిరిగి కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో కేంద్రం ఏం చేయబోతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో వారికి అనుకూలంగా వ్యవహరిస్తుందా లేక నిబంధనల విషయంలో వెనక్కి తగ్గడం సాధ్యం కాదని చెప్పేస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
పంచాయతీ పోరులో తలోమాట
ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందే కత్తులు దూసుకున్న జగన్ సర్కార్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆ తర్వాత కూడా పలు అంశాల్లో విభేదిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ ఎన్నికలకు తాజా ఓటర్ల జాబితా అందించడంలో విఫలమైన ఐఏఎస్ అధికారుల అభిశంసన వంటి అంశాల్లో భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిశంసన వ్యవహారం ఇరువర్గాల మధ్య పంతాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది.
ఐఏఎస్ల అభిశంసన కేంద్రం చేతుల్లోకి
2021 జనవరి నాటికి ఓటర్లుగా నమోదైన వారితో కలుపుకుని తాజా ఓటర్ల జాబితా అందించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కోరినా పంచాయతీ ఎన్నికలు జరగకూడదన్న జగన్ సర్కారు ఆలోచనకు అనుగుణంగా పంచాయతీ రాజ్శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ దాన్ని అందించలేదు. ఈ కారణంతో రాష్ట్రంలో ఓట్లు నమోదు చేసుకున్న 3.6 లక్షల మంది యువ ఓటర్లు ఓటుహక్కు కోల్పోయారు. దీనికి బాధ్యులైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్లపై అభిశంసన చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఈసీ సిఫార్సు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రొసీజర్ లోపాల పేరుతో దాన్ని తిరస్కరించింది. దీనిపై ఇప్పుడు జగన్ సర్కార్తో పాటు నిమ్మగడ్డ కూడా కేంద్రాన్ని ఆశ్రయించారు.
కేంద్ర సిబ్బంది, బలగాల విషయంలోనూ
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఉద్యోగులు తనకు పంచాయతీ ఎన్నికల్లో సహకరించరన్న ఉద్దేశంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ తనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, కేంద్ర బలగాలను కేటాయించాలని లేఖ రాశారు. డీవోపీటీ, హోంశాఖకు రాసిన రెండు వేర్వేరు లేఖలు ఇప్పుడు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. అయితే వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం సాధ్యం కాదంటూ ఏపీ సర్కార్ కేంద్ర ఆరోగ్యశాఖకు మరో లేఖ రాసింది. ఓవైపు హైకోర్టు ఆదేశాల అమల్లో భాగంగా వ్యాక్సినేషన్, ఎన్నికలు రెండింటినీ ఏకకాలంలో నిర్వహించేందుకు నిమ్మగడ్డ కేంద్రం సాయం కోరిన నేపథ్యంలో ఎన్నికలు ఉన్నందున వ్యాక్సినేషన్ చేపట్టలేమంటూ జగన్ సర్కార్ రాసిన లేఖ దానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి దీనిపైనా కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Recommended Video
జగన్, నిమ్మగడ్డ పోరు తీర్చేది డీవోపీటీయేనా?
పంచాయతీ ఎన్నికల నిర్వహణ, వ్యాక్సినేషన్ ఏకకాలంలో నిర్వహించాల్సిన పరిస్ధితుల్లో ఎస్ఈసీ నిమ్మగడ్డతో పాటు జగన్ సర్కార్ కూడా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ డీవోపీటీని ఆశ్రయించాయి. దీంతో డీవోపీటీ తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయంతో ఓ ప్రతిష్టంభన వీడిపోగా.. ఇప్పుడు డీవోపీటీ తీసుకునే నిర్ణయంతో ఈ వివాదాలకు ఫుల్స్టాప్ పడాల్సి ఉంది. అయితే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న వైసీపీ సర్కారు విషయంలో డీవోపీటీ సానుకూలంగా వ్యవహరిస్తుందా లేక నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని నిమ్మగడ్డకు మద్దతుగా ఆదేశాలు ఇస్తుందా అన్నది తేలాల్సి ఉంది.