108 సిబ్బందికి జగన్ బంపర్ ఆఫర్ - ఒక్కసారిగా జీతాల రెట్టింపు- పనితీరే ప్రాతిపదిక...
ఏపీలో ఎమర్జెన్సీ సర్వీసుల విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో నిరూపిస్తూ సీఎం జగన్ ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్ధాయిలో 104, 108 వాహనాలను ప్రారంభించిన జగన్... ఆ వెంటనే 108 సిబ్బందికి భారీగా జీతాలను పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల పనితీరును బట్టి వర్తించేలా కొ్త్త స్కేలును ప్రకటించారు. దీంతో ఎమర్జెన్సీ సేవలైన అంబులెన్స్ ల సిబ్బందిలో పోటీ తత్వం పెరగనుంది.
వారం రోజుల్లో మరో పథకం: 7, 8 తేదీల్లో వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన: ఈ స్కీమ్ అక్కడే ప్రారంభం
108 సిబ్బందికి బంపర్ ఆఫర్...
ఏపీలో అత్యవసర సేవల నిర్వహణలో పెనుమార్పులు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో చాలీ చాలని జీతాలతో నిత్యం సమ్మెలు చేస్తూ అత్యవసర పరిస్దితుల్లోనూ 108 సర్వీసుల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఇవాళ అనూహ్య నిర్ణయం ప్రకటించారు. 104, 108 సర్వీసుల ప్రారంభం తర్వాత సీఎం జగన్ అప్పటివరకూ ఎవరికీ బయటపెట్టకుండానే ఆకస్మికంగా 108 అంబులెన్స్ సిబ్బంది జీతాలను పెంచుతూ కీలక నిర్ణయం ప్రకటించారు. దీంతో 108 ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
జీతాల పెంపు వర్తించేది ఇలా...
ప్రస్తుతం 108 వాహనాల డ్రైవర్లకు పనితీరుతో సంబంధం లేకుండా నెలకు పది వేల రూపాయలు చెల్లిస్తున్నారు. అదే అందులో ఉండే మెడికల్ టెక్నీషియన్లకు రూ.12 వేలు చెల్లిస్తున్నారు. ఇవి కూడా గతంలో పలుమార్లు సమ్మె తర్వాత పెరిగిన జీతాలే. వీటి స్ధానంలో ఇప్పుడు డ్రైవర్లకు కనీసం 20 వేలు, టెక్నీషియన్లకు కనీసం 18 వేలు ఇస్తామని సీఎం జగన్ ఇవాళ ప్రకటించారు. అంటే డ్రైవర్లకు కనీసం 8 వేల రూపాయలు, టెక్నీషియన్లకు కనీసం 6 వేల రూపాయల పెంపు ఖాయమే. ఆ తర్వాత కూడా పనితీరు ఆధారంగా జీతం పెరిగేలా స్కేల్ ఇచ్చారు.
పనితీరు ఆధారంగా జీతాలు...
108 సర్వీసుల్లో పనిచేసే డ్రైవర్లు, టెక్నీషియన్లకు ఇచ్చే జీతాల్లోనూ పనితీరుకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. దీని ప్రకారం ఇకపై ప్రస్తుతం డ్రైవర్ కు ఇస్తున్న 10 వేల స్ధానంలో కనీసం 18 వేలకు పెంచిన ప్రభుత్వం పనితీరు ఆధారంగా 28 వేల వరకూ చెల్లించేందుకు సిద్ధమైంది. అలాగే టెక్నీషియన్లకు కూడా కనీస జీతం 20 వేలకు పెంచిన ప్రభుత్వం పనితీరు మెరుగ్గా ఉంటే గరిష్టంగా 30 వేల వరకూ చెల్లించబోతోంది. దీంతో 108 సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది పనితీరు మెరుగుపడటంతో పాటు సేవల నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.